భైంసా గవర్నమెంట్​ స్కూల్​లో ఊడుతున్న పెచ్చులు

భైంసా గవర్నమెంట్​ స్కూల్​లో ఊడుతున్న పెచ్చులు
  • ప్రమాదకరంగా మారిన 87 ఏండ్ల నాటి భవనం
  •  పురాతన బిల్డింగ్​లోనే 400మందికి చదువు
  •  ఆందోళనలో టీచర్లు, స్టూడెంట్లు

భైంసా, వెలుగు: పట్టణంలోని గవర్నమెంట్​ స్కూల్​ బిల్డింగ్​ శిథిలావస్థకు చేరి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇటీవల వానల కారణంగా 87 ఏండ్ల నాటి ఆ బిల్డింగ్​లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత పెచ్చులూడాయి. క్లాస్​ రూమ్​లోకి, హెచ్​ఎం ఆఫీస్​లోకి నీళ్లు వచ్చాయి. టేబుళ్లు, ఫైళ్లు అన్నీ తడిచిపోయాయి. తరగతి గదుల్లో పాఠాలు చెప్పడానికి వీలులేకపోవడంతో.. టీచర్లు, విద్యార్థులు ఆరుబయటే కూర్చున్నారు. అదే టైంలో వానకురవడం వల్ల ఇబ్బంది పడ్డారు. 

87 ఏండ్ల బిల్డింగ్​.. 

ఉమ్మడి మహారాష్ట్రలో భైంసా ప్రాంతం ఉండడంతో 1935లో ఈ బిల్డింగ్​ నిర్మించారు.
రాష్ట్రాల విభజనలో భాగంగా భైంసా ప్రాంతం తెలంగాణలో కలిసింది. నేటి వరకు ఆ స్కూల్​ బిల్డింగ్​కు సరైన సౌకర్యాలు కల్పించలేదు సర్కారు. పలుమార్లు స్కూల్​ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు, టీచర్లు కోరినా పట్టించుకోలేదు. దాదాపు 400 మంది విద్యార్థులు ఈ స్కూల్​లో చదువుకుంటున్నారు. ఆదివారం రాత్రి పదో తరగతి గదుల్లో పైన, సైడ్స్​లకు పెచ్చులుడి పడ్డాయి. ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షాలతో వారం రోజుల తర్వాత స్కూళ్లు ప్రారంభం కాగా.. టీచర్లు, స్టూడెంట్స్​ కింద పడిన పెచ్చులను చూసి ఆందోళకు గురయ్యారు. దీంతో పాటు హెచ్​ఎం ఆఫీస్​లో ఉరుస్తోంది.   ముఖ్యమైన ఫైళ్లు తడిసిపోయాయి. కాగా.. ఈ స్కూల్​లో చదివిన వారంతా ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు. శాస్త్రవేత్తలు, కేంద్ర, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నత ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి విద్యార్థులను అందించిన స్కూల్​పై సర్కారు చిన్నచూపు చూస్తుందని పూర్వ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. 

మన ఊరు-మన బడిలో ఎంపిక.. 

 మన ఊరు-మన బడి కార్యక్రమంలో భైంసా గవర్నమెంట్​ హైస్కూల్​ను ఎంపిక చేశారు. మొదట రూ. 3.8కోట్లు మంజూరు చేయగా.. తర్వాత రూ. 2కోట్ల కు తగ్గించారు. అయినా ఈ స్కూల్​ బిల్డింగ్​ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు నిర్వహించలేకపోతున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ స్కూల్​లో సరైన వసతులు లేక టీచర్లు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెచ్చులు ఊడి పడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోని విద్యబోధన సాగిస్తున్నారు. అటు పోషకులు సైతం అసహానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్త బిల్డింగ్​ నిర్మించి అన్ని వసతులు కల్పించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ప్రమాదకరంగా మారింది

గవర్నమెంట్​ హైస్కూల్​ను 1935లో అప్పటి మహారాష్ట్ర సర్కారు నిర్మించింది. ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోతోంది. ఇప్పటికే పది గదుల్లో పెచ్చులుడిపడ్డాయి. భయం భయంతో తరగతులను కొనసాగిస్తున్నాం. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని మా సిబ్బంది, స్టూడెంట్స్​ భయాందోళనలో ఉన్నాం. వెంటనే కొత్త బిల్డింగ్​ నిర్మించాలి.

- మోహన్​రావు, హెచ్​ఎం