
నేరుగా ఇంజనీరింగ్ కే స్టూడెంట్స్ మొగ్గు
తగ్గుతున్న పాలిటెక్నిక్ కాలేజీలు, అడ్మిషన్లు
ఐదేండ్లలో మూతపడ్డ 75 ప్రైవేటు కాలేజీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుపై స్టూడెంట్స్కు ఇంట్రెస్ట్ తగ్గుతోంది. టెన్త్ తో కాకుండా ఇంటర్ పూర్తి చేసిన తర్వాతే ఇంజనీరింగ్లో చేసేందుకు స్టూడెంట్లు మొగ్గు చూపుతున్నారు. తగ్గుతున్న పాలిటెక్నిక్ కాలేజీలు, అడ్మిషన్లే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 145 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. 55 సర్కారు కాలేజీలు కాగా, మిగిలినవన్నీ ప్రైవేటు కాలేజీలు. పాలిసెట్ ద్వారా కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది 36,240 సీట్లు అందుబాటులో ఉండగా, 24,738 సీట్లే భర్తీ అయ్యాయి. ఐదేండ్లుగా ఈ కోర్సు చదివే స్టూడెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో కాలేజీలూ తగ్గుతున్నాయి. 2015–16 విద్యా సంవత్సరంలో 220 కాలేజీలుంటే, 2019–20 నాటికి 145కు పడిపోయాయి. ఐదేండ్లలో సర్కారు కాలేజీలు11 పెరగగా, 75 ప్రైవేటు కాలేజీలు మూతపడ్డాయి.
రాష్ట్రంలో 90 ప్రైవేటు కాలేజీలుండగా, వీటిలో రెండు కాలేజీలే పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. మిగిలినవన్నీ ఇంజనీరింగ్కాలేజీల్లో సెకండ్ షిఫ్ట్లో నడుస్తున్నాయి. దీంతో ఆయా కాలేజీల్లో ఎక్కువగా స్టూడెంట్లు చేరడం లేదు. ఈ విద్యాసంవత్సరం 68.26 శాతం సీట్లే నిండాయి. సర్కారు కాలేజీల్లో మాత్రం మెజార్టీ సీట్లు భర్తీ అయ్యాయి. అడ్మిషన్లు తగ్గడానికి పాలిటెక్నిక్ కోర్సుపై ఇంట్రెస్ట్ తగ్గడంతో పాటు స్టూడెంట్స్కు బయోమెట్రిక్ అటెండెన్స్తప్పనిసరి చేయడం కూడా మరో కారణంగా తెలుస్తోంది.
అఫ్లియేషన్స్ కు దరఖాస్తులు
వచ్చే విద్యాసంవత్సరం కాలేజీల అఫ్లియేషన్కోసం టెక్నికల్ ఎడ్యుకేషన్ మూడు రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల10 నుంచి మార్చి7 వరకూ కాలేజీ మేనేజ్మెంట్ల నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్స్ స్వీకరిస్తారు. రూ.5 వేల ఫైన్తో మార్చి13 వరకు గడువుంది. మార్చి16 నుంచి 31 వరకూ అధికారులు ఆయా కాలేజీల్లో తనిఖీలు చేస్తారు. ఏప్రిల్ 13 నుంచి 15 తేదీల్లో ఫస్ట్ ఫేజ్లో ఎలిజిబుల్ కాలేజీల షార్ట్ లిస్టు, మే 5న సెకంట్ షార్ట్ లిస్టు విడుదల చేస్తారు. ఈ క్రమంలో 15 నుంచి 20 ప్రైవేటు కాలేజీల వరకూ మూతపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.