
పరిగి, వెలుగు: తమకు ఫ్యాకల్టీ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలని, డిజిటల్ క్లాసులతో సరిపెట్టుకోవాలంటే కుదరదని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా పరిగి విద్యారణ్యపురి గిరిజన బాలికల గురుకుల స్కూల్/కాలేజీలో కొంతకాలంగా మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు టీచర్లు లేరు. ప్రత్యామ్నాయంగా డిజిటల్ క్లాసుల ద్వారా పిల్లలకు బోధన అందిస్తున్నారు.
గణితంలో తమకు డౌట్లు వస్తే డిజిటల్ క్లాసుల్లో పరిష్కారం దొరకడం లేదని, తప్పకుండా తమకు టీచర్లను ఏర్పాటు చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో గురువారం ఉపవాస దీక్షకు దిగారు. ఫ్యాకల్టీ కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ వారికి సర్దిచెప్పారు.