- డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూస్తం
- బస్పాస్తోసహా ఇతర అన్ని సంక్షేమ పథకాలూ వర్తింపజేయిస్తం
- టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
బషీర్బాగ్, వెలుగు: మీడియా కార్డులతో ఎలాంటి నష్టం లేదని, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా తమ సంఘం చూస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తెలిపారు. డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకోబోమని చెప్పారు. బస్పాస్లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు ప్రభుత్వంతో చర్చించి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని తెలిపారు.
ఆదివారం హైదరాబాద్ బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో విరాహత్అలీ మాట్లాడారు.
జర్నలిజంలో విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకొచ్చిందని తెలిపారు. ఉనికి చాటుకోవడానికే డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందంటూ కొన్ని సంఘాలు గగ్గోలు పెడుతున్నాయని, అబద్ధాలు, కల్పితాలతో వాళ్లు చేస్తున్న అపోహలు నమ్మవద్దని ఆయన కోరారు.
252 జీవో తెచ్చి జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డిని విమర్శించడం సరైంది కాదన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏడుగురు ప్రముఖులైన పాత్రికేయులతో కమిటీ ఏర్పాటై, ఐదారుసార్లు సమావేశమై మార్గదర్శకాలు రూపొందించిన విషయం ఆందోళన చేస్తున్న సంఘాలకు తెలియదా? అని ప్రశ్నించారు.
