- నల్గొండ జిల్లా పుల్లెంలకు తరలివచ్చిన ప్రజలు, నాయకులు
చండూరు, వెలుగు : మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేశ్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ముగిశాయి. గురువారం ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో గణేశ్ చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులు ఒడిశా వెళ్లి గణేశ్ డెడ్బాడీని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులు గణేశ్తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
చిన్ననాటి స్నేహితులు హనుమంతు డెడ్బాడీని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు పలు జిల్లాల నుంచి ప్రజలు, వివిధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పుల్లెంలకు తరలివచ్చి గణేశ్కు నివాళి అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి అయిలయ్య, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్, నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాశ్ నేత, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, మునగాల నారాయణరావు, పౌర హక్కుల సంఘం సభ్యులు, విప్లవ విద్యార్థి వేదిక నాయకులు విజయరామరాజు, ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావుతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు గణేశ్ డెడ్బాడీ వద్ద నివాళి అర్పించారు.
