బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం కార్యాలయానికి విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో లేఖలు పంపారు. సోమవారం కాచిగూడలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ విగ్రహాల నిర్మాణం కంటే విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని, బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని హాల్ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు.
అలాగే, రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు అద్దెలు చెల్లించకపోవడంతో యజమానులు భవనాలను ఖాళీ చేయిస్తున్నారని, దీనివల్ల పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారన్నారు. త్వరలోనే ఈ సమస్యలపై ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నరేశ్, మోహన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
