ఈ స్కూళ్లో మేం ఉండలేం.. సౌలతుల్లేక ఇండ్లకు వెళ్లిన స్టూడెంట్లు

ఈ స్కూళ్లో మేం ఉండలేం..  సౌలతుల్లేక ఇండ్లకు వెళ్లిన స్టూడెంట్లు

మంచిర్యాల, వెలుగు :  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీ దగ్గరలోని తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూల్​అండ్​ జూనియర్​ కాలేజీ (బాయ్స్​) ఖాళీ అయ్యింది.  ఓవైపు డంపింగ్​యార్డు పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరోవైపు రేకుల షెడ్లలో కనీస సౌలత్​లు కూడా లేవు.  ఇందులో చదువుకుంటున్న 640 మంది స్టూడెంట్లు ‘‘ఈ స్కూల్​లో మేము ఉండలేం”అని ఈమధ్యనే ఇండ్లకు వెళ్లిపోయారు. ఇక్కడ పనిచేస్తున్న 25 మంది టీచర్లు రోజూ వచ్చి టైమ్​పాస్​ చేసి వెళ్తున్నారు.  నాలుగు రోజుల  నుంచి హైస్కూల్​ స్టూడెంట్లకు ఆన్​లైన్ క్లాస్​లు చెప్తున్నారు.  ఏకంగా స్కూల్​ మూతపడ్డప్పటికీ లోకల్​ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు గానీ,  సంబంధిత శాఖ ఆఫీసర్లు గానీ పట్టించుకోవడం లేదని పేరెంట్స్​ కమిటీ ప్రతినిధులు మండిపడ్తున్నారు. స్కూల్​ను మరో చోటికి మార్చేంత వరకు పిల్లలను పంపబోమని పేరెంట్స్​అంటున్నారు.  

ఏడేండ్లలో మూడుసార్లు మార్పు 

2016లో మంచిర్యాల నియోజకవర్గానికి  సోషల్​వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ శాంక్షన్​ అయ్యింది. కాలేజీ రోడ్​లోని ఓ ప్రైవేట్​బిల్డింగ్​లో  2018 వరకు నిర్వహించారు.  అక్కడ సరైన సౌలతులు లేకపోవడంతో మంచిర్యాల పక్కనే ఉన్న గద్దెరాగడి మెయిన్​ రోడ్డులోని మరో ప్రైవేట్​ బిల్డింగ్​లోకి  షిఫ్ట్​ చేశారు.  నిరుటి వరకు అందులోనే నడిపించారు. జూనియర్​ కాలేజీగా అప్​గ్రేడ్​కావడంతో ఇంటర్​ బోర్డు నుంచి అఫిలియేషన్​ చిక్కు వచ్చిపడింది.  మంచిర్యాల నియోజకవర్గానికి శాంక్షన్​ అయిన కాలేజీని చెన్నూర్​ నియోజకవర్గం పరిధిలోని గద్దెరాగడిలో నిర్వహించడంపై ఇంటర్​ బోర్డు అభ్యంతరం తెలిపింది. ఆఫీసర్లకు సమస్య వివరించి ఎలాగోలా అఫిలియేషన్​ తెచ్చుకున్నారు. కానీ ఈ అకాడమిక్​ ఇయర్​ నుంచి మాత్రం తప్పనిసరిగా మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోనే  నిర్వహించాలని ఇంటర్​బోర్డు స్పష్టం చేసింది.  దీంతో ఈ ఏడాది జూన్​లో మంచిర్యాలలోని అండాలమ్మ కాలనీకి మార్చారు.  

పక్కనే డంపింగ్​ యార్డు 

అండాలమ్మ కాలనీ దగ్గరలోని బీఆర్ ఫంక్షన్​హాల్​లో ప్రస్తుతం సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూల్​ అండ్​ కాలేజీని ఏర్పాటు చేశారు. నెలకు దాదాపు రూ.2 లక్షల రెంట్​ చెల్లిస్తున్నారు. పైఆఫీసర్ల సూచనల మేరకు ఫంక్షన్​ హాల్​ మేనేజ్​మెంట్​ స్కూల్​నిర్వహణకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇక్కడినుంచి కేవలం 300 మీటర్ల దూరంలో అండాలమ్మ కాలనీలో టెంపరరీ డంపింగ్​ యార్డు ఉంది.  మంచిర్యాల మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను ఇక్కడే డంప్​చేసి కాల్చుతుంటారు. పెద్ద ఎత్తున పొగ లేచి చుట్టుపక్కల కాలనీలను కమ్మేస్తోంది.  విషపూరితమైన వాయువులు వెలువడడంతో అండాలమ్మ కాలనీ ప్రజలు రోగాలబారిన పడ్తున్నారు. ఈ స్కూల్​లోని పలువురు స్టూడెంట్లను సైతం ఊపిరితిత్తులు, చర్మ రోగ సమస్యలు చుట్టుముట్టాయి. మరోవైపు రేకుల షెడ్లలో సరైన  సౌలతులు లేక స్టూడెంట్లు తిప్పలు పడ్తున్నారు. సరిపడా రూమ్​లు లేవు.  డార్మెటరీ పనులు పూర్తి కాలేదు.  

వర్షాలప్పుడు ఇంటికి పోయి అటే 

జూలై నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు స్కూల్​ ఆవరణ పూర్తిగా జలమయమైంది. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పేరెంట్స్​ వచ్చి తమ పిల్లలను తీసుకెళ్లారు. సెలవుల తర్వాత 640 మందిలో 250 మంది వరకు తిరిగి రాగా, మిగిలిన వాళ్లను పేరెంట్స్​ పంపలేదు. వచ్చిన ఆ కొద్ది మంది కూడా ఇక్కడ ఉండలేక ఒక్కొక్కరు ఇంటిదారి పట్టారు. మిగిలిన పిల్లలను టీచర్లే ఇండ్లకు పంపినట్టు సమాచారం. ఈ నెల 14, 15 తేదీల్లో స్కూల్​ మొత్తం ఖాళీ అయ్యింది. పిల్లలు లేకున్నా టీచర్లు మాత్రం ఎప్పటిలాగే వచ్చిపోతున్నారు. రెండు రోజుల నుంచి హైస్కూల్​ స్టూడెంట్లకు ఆన్​లైన్​ క్లాస్​లు చెప్తున్నారు.  

సొంత బిల్డింగ్​ నిర్మాణానికి ఫండ్స్​ లేవ్​

 ప్రతి నియోజకవర్గానికి సోషల్​ వెల్ఫేర్ రెసిడెన్షియల్​ ను శాంక్షన్​ చేసిన సర్కారు బిల్డింగులు కట్టడానికి  ఫండ్స్​ ఇవ్వలేదు. ఈ స్కూల్​కోసం హాజీపూర్​ మండలం గుడిపేటలో ల్యాండ్  కేటాయించి ఏండ్లు గడుస్తున్నా ఫండ్స్​ కేటాయించకపోవడంతో  బిల్డింగ్​ నిర్మాణ పనులు మొదలు కాలేదు.  కాలేజీలో ఎంపీసీ, ఒకేషనల్​ గ్రూపులు ఉండగా,  ఒక్కో గ్రూపులో 80 మంది చొప్పున ఉన్నారు. రూమ్​ల కొరత వల్ల ఒకేషనల్​ గ్రూపును జైపూర్​ స్కూల్​లో కొనసాగిస్తున్నారు.  

పిల్లల బాధ చూడలేక తీసుకెళ్లినం

మా కొడుకు మణిరత్న  ఇక్కడే ఆరో తరగతి చదువుతున్నడు. స్కూల్​లో కనీస సౌలతులు లేకపోగా, పక్కనే ఉన్న డంపింగ్​ యార్డు పొగతో  పిల్లలు రోగాల పాలైతున్నరు. మణిరత్నకు స్కిన్​ ఎలర్జీ వచ్చి శరీరమంతా వాపొచ్చింది.  హాస్పిటల్​కు పోతే రూ.40 వేలు ఖర్చయింది. ఇంకా కోలుకోలేదు. చెన్నూర్​ మండలం సుద్దాలకు చెందిన నిశాంత్​(ఆరో తరగతి)కు ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్​ వచ్చి సీరియస్​ అయ్యింది. ట్రీట్​మెంట్​కు రూ.2లక్షలకు పైగా ఖర్చయినట్టు తెలిసింది.  

దుర్గం రాజు, పేరెంట్​, భీమారం 

 వేరే బిల్డింగ్​లోకి మార్చుతాం
 
ఏ నియోజకవర్గానికి శాంక్షన్​ అయిన స్కూల్​ అండ్​ కాలేజీ ఆ పరిధిలోనే  నిర్వహించాలన్న రూల్స్​ ఉన్నాయి. లేకుంటే ఇంటర్​ బోర్డు అఫిలియేషన్​ ఇవ్వదు.  దీంతో స్కూల్​ను గద్దెరాగడి నుంచి అండాలమ్మ కాలనీకి మార్చాం. ఉన్నతాధికారులు పరిశీలించి పర్మిషన్​ ఇచ్చాకే ఇక్కడికి షిఫ్ట్​ చేశాం. త్వరలోనే అన్ని సౌలతులు ఉన్న బిల్డింగ్​లోకి మార్చుతాం.   - స్వరూపారాణి, రీజినల్​ కోఆర్డినేటర్​ 

రూ.30 లక్షలు ఖర్చు చేసినం

మేము ఇంతకుముందు ఇక్కడ ఫంక్షన్​ హాల్​ నడిపినం. స్కూల్​కు తీసుకొమ్మని ఎవరినీ అడగలేదు. ఆఫీసర్లే వచ్చి చూసి అనుకూలంగా ఉన్నదని తీసుకున్నరు. ఫంక్షన్​ హాల్  సామాన్లు తీసేసి స్కూల్​కు అనుగుణంగా మార్పులు చేపట్టినం. ఇప్పటికే రూ.30 లక్షల ఖర్చయింది. మూడు నెలలకే స్కూల్​ను  తీసేస్తే మేము లాస్​ అయితం. 

బొలిశెట్టి రాజలింగం, ఫంక్షన్​ హాల్​ ఓనర్​