జనగామ, వెలుగు: జనగామలోని ధర్మకంచ హైస్కూల్లో హెచ్ఎం ఇద్దరు స్టూడెంట్లకు టీసీలు ఇవ్వడం వివాదాస్పదమైంది. గోల్డ్ చైన్ వేసుకుని స్కూలుకు వచ్చినందుకు హెచ్ఎం టీసీలు ఇచ్చి పంపించేశారని బాలికలు ఆరోపించగా, వాళ్లు అడిగితేనే టీసీలు ఇచ్చామని హెచ్ఎం చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో బాలికలిద్దరూ సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్సింగ్ను కలిసి హెచ్ఎంపై ఫిర్యాదు చేశారు.
ఆయన సమగ్ర విచారణ జరిపాలని డీఈఓ రామును ఆదేశించారు. బాధిత బాలికలు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన పి.సమిత, సారిక కవలలు. స్థానిక హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గత శుక్రవారం సమిత, సారిక మెడలో బంగారు గొలుసులు వేసుకుని స్కూలుకు వెళ్లగా, టీచర్మందలించి హెడ్మాస్టర్స్వర్గం ప్రకాశం వద్దకు తీసుకెళ్లారు. హెచ్ఎం బాలికలపై కోప్పడి, వెంటనే వెళ్లి మీ పేరెంట్స్ను తీసుకురావాలని చెప్పాడు.
చిన్నారులు ఇద్దరూ ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మను తీసుకొచ్చారు. ఆమెపై కూడా హెచ్ఎం కోప్పడడంతో టీసీలు ఇచ్చేయండి అనగా.. హెచ్ఎం ఇచ్చేశారని బాలికలు వాపోయారు. ఈ విషయమై హెచ్ఎం ప్రకాశంను వివరణ కోరగా బాలికలు ఇద్దరూ ఇర్రెగ్యులర్స్టూడెంట్లని చెప్పారు. స్కూలుకు రాకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించగా, మర్యాద లేకుండా మాట్లాడారని తెలిపారు. శుక్రవారం బాలికల తల్లి వచ్చి లిఖిత పూర్వకంగా టీసీ ఇవ్వాలని అడిగితేనే తాము ఇచ్చామని వెల్లడించారు. అవసరమైతే స్కూల్సీపీ పుటేజీలను పరిశీలించవచ్చునన్నారు.