
- రూ.15 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు
- అవగాహన లేక పథకానికి ఆదరణ కరువు
సంగారెడ్డి, వెలుగు: మాంసం వినియోగం రోజురోజుకు పెరుగుతోంది కానీ ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం మాంసం ఉత్పత్తిని పెంచేందుకు జీవాల కొనుగోలుకు రుణాలను అందిస్తోంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం) పథకం కింద సబ్సిడీతో కూడిన లోన్స్ మంజూరు చేస్తోంది. గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, నాటుకోళ్లు, పందులు, పుంజులతో పాటు పశుగ్రాసం, దాన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2021–-22లో ఈ పథకం ప్రారంభించారు. కానీ ఈ స్కీం గురించి చాలామందికి అవగాహన లేకపోవడంతో రుణాలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పశుసంవర్ధక అధికారులు ఈ పథకం గురించి ప్రచారం చేయకపోవడంతో చాలామందికి దీని గురించి తెలియదు.
యూనిట్ కు 50 శాతం సబ్సిడీ
ఎన్ఎల్ఎం స్కీం కింద అధికారులు రూ.15 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు ఇస్తున్నారు. సెలెక్ట్ చేసుకున్న యూనిట్ ఆధారంగా 50 శాతం సబ్సిడీ లభిస్తోంది. ఆసక్తి కలిగిన లబ్ధిదారులు www.nlm.udyamimtra.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి ఫొటో, అడ్రస్, ఆధార్ కార్డు, బ్యాంకు స్టేట్మెంట్ అప్లోడ్చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు ఉండదు.
అవగాహన కల్పిస్తున్నాం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎల్ఎం స్కీంపై అవగాహన కల్పిస్తున్నాం. పశుసంతతిపై మార్కెట్లో దుష్ప్రచారం పెరిగిపోవడం వల్ల లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ఆసక్తి చూపడం లేదు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి చైతన్య పరుస్తున్నాం. ప్రతి యూనిట్ కు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ స్కీంని సద్వినియోగం చేసుకోవాలి.
వసంత కుమారి, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి