‘నువ్వు ప్రయాణం చేయనప్పుడు,
నువ్వు దేశాలు తిరగనప్పుడు,
నీ దినచర్య మార్చుకోలేనప్పుడు
నీ కలలను నువ్వు వెంటాడుతూ పోలేనపుడు,
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు’
అంటాడు పాపులర్ చిలీ పోయెట్ ‘పాబ్లో నెరుడా’... ఇలా మనిషి తన డ్రీమ్స్ కోసం, తనను తాను కొత్తగా మార్చుకోవడం, జీవితాన్ని ఆనందించడం కోసం గొప్ప గొప్ప గోల్స్ పెట్టుకోవాలి. అలాంటి గోల్స్నే రీచ్ అవుతోంది కాశ్మీర్కు చెందిన సూఫియా ఖాన్. తన ఆనందం కోసమే కాదు, దేశం కోసం పరుగెడుతోంది. ఆమె పరుగు ప్రపంచ రికార్డులను సృష్టించింది. ప్రపంచంలోనే మొదటి అల్ట్రా మారథాన్ రన్నర్గా సోఫియా రికార్డు నెలకొల్పింది. మనాలి నుంచి లెహ్ వరకూ ఆరు రోజుల్లోనే 480 కిలోమీటర్లు పరిగెత్తి తన సత్తా చాటింది.
రాజస్తాన్లో పుట్టిన ఈ అమ్మాయి... కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ.. జైపూర్ నుంచి ఆగ్రా, ఢిల్లీ వరకూ చిరుతలా పరిగెత్తింది. ఇటీవల మనాలి నుంచి లెహ్ వరకూ పరిగెత్తిన మొదటి అల్ట్రా మారథాన్ రన్నర్ అనిపించుకుంది. సూఫియా ఖాన్ పుట్టింది రాజస్తాన్లోని అజ్మీర్లో. ఆమెది పేద కుటుంబం. పదహారేండ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి కష్టపడి డిగ్రీ వరకు చదివించింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక గవర్నమెంట్ జాబ్ చేయమని చెప్పేది తల్లి. కానీ సూఫియా డ్రీమ్స్ వేరు. ఆమెకు ఏవియేషన్ ఫీల్డ్ అంటే ఇష్టం. అందుకు ఒక ప్రైవేట్ కంపెనీలో స్టాఫ్గా చేరింది. అక్కడ పని ఎంతో క్రిటికల్ గా ఉండేది. అదొక రకమైన చాకిరి. ‘ఇష్టమైన ఫీల్డ్ కూడా ఇంత కష్టమా’ అనిపించింది తనకే. అయినా ఏడాది కాలంగా ఆ కంపెనీలో బండ చాకిరి చేసింది. ఒక దశలో తను చేయాలను కుంది ఇది కాదు కదా అని అనిపించింది తనకు. బక్కచిక్కి పోతున్న తన శరీరాన్ని చూసి బాధపడింది. అప్పుడు ఫిట్నెస్ మీద దృష్టి పెట్టింది. రోజూ కొంత పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అలా మెల్లగా స్టార్ట్ అయిన పరుగు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆరోగ్యం, ఫిట్నెస్ పెరిగింది. ఒత్తిడిని తగ్గింది. దాంతో తనకు పరుగే సరైన తొవ్వ అనుకుంది. అందుకోసం ఎయిర్లైన్స్లో ఉద్యోగం మానేసీ షూ లేస్ బిగించింది. పరుగెడుతూ పరుగెడుతూ ఓ సందేశాన్ని తీసుకెళ్లాలి అనుకుంది. అలా మొదటి సారి ‘రన్ ఫర్ హోప్– హ్యుమానిటీ, పీస్, ఈక్వాలిటి’ సందేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్లు పరిగెత్తింది. 2019 ఏప్రిల్లో రోజుకు సుమారు50 కిలోమీటర్ల లెక్కన వంద రోజులు పరిగెత్తి రికార్డు సృష్టించింది. అదే అమె మొదటి అఛీవ్మెంట్. అప్పటితో ఆమె ఆగిపోలేదు. ఆ తర్వాత ఆమె 16 రోజుల్లో 720 కిలోమీటర్ల గ్రేట్ ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్ రన్ చేసింది. ఈ రకమైన పరుగు తీసిన మొదటి మహిళగా కూడా రికార్డుకెక్కింది. ఈ మధ్య గా సెప్టెంబర్ 2021 ‘హిమాలయన్ ఆల్ట్రా రన్ ఎక్స్పిడిషన్’ మనాలి నుంచి మొదలుపెట్టింది. 480 కిలోమీటర్ల దూరం అది. అక్టోబర్ 1న లెహ్ లడక్లో ముగించింది. ఇన్ని కిలోమీటర్ల పరుగు తీసిన వాళ్లు ఇప్పటి వరకూ ఎవరూ లేరు.
లెహ్– మనాలి రెండూ సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉంటాయి. రోడ్లు బాగుండవు. లోయలు, నదులు, కొండ చరియలు, మంచు కొండలు, మైనస్ డిగ్రీల్లో చలి. ఇలా ఉంటుంది అక్కడి పరిస్థితి అయినా సంకల్పం ముందు అవేమీ పెద్ద విషయం అనిపించలేదు సూఫియాకు.‘ పరిస్థితులు ఎలా ఉన్నా పరుగెత్తాను. దీని కోసం ఈ ఏరియాలో క్యాంప్ వేసి ఇక్కడి వాతావరణాన్ని అలవాటు చేసుకున్నాను. దానికి తగ్గట్టు రెడీ అయ్యాను’ అంటోంది సూఫియా. ఇప్పటి వరకూ రెండు గిన్నిస్ రికార్డులున్నాయి.