
హైదరాబాద్, వెలుగు: ఒకట్రెండు సంవత్సరాల్లో తెలంగాణ అంతటా రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తామని సుగుణా ఫుడ్స్ జనరల్ మేనేజర్ మురళీ సుందర్ రావు (సేల్స్, మార్కెటింగ్) అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్, కెన్యాలోనూ తమకు స్టోర్లు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో జరుగుతున్న పౌల్ట్రీ ఎక్స్పోకు వచ్చిన సందర్భంగా ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. తమకు నాలుగు రాష్ట్రాల్లో ప్రాసెస్ ప్లాంట్లతో పాటు దేశవ్యాప్తంగా 70 ఫీడ్స్ మిల్స్, 70 కి పైగా హ్యాచరీస్ ఉన్నాయని వివరించారు. 40 వేల మందితో కలిసి తాము పనిచేస్తున్నాయని, వీరిలో కొందరు కాంట్రాక్టు వ్యవసాయం చేస్తారని చెప్పారు. ‘‘మాది కోయంబత్తూరు కేంద్రంగా పనిచేసే కంపెనీ. మాకు మొత్తం నాలుగు బ్రాండ్లు ఉన్నాయి. సుగుణా చికెన్, సుగుణా ఫీడ్స్, డెల్ఫ్రెజ్ (స్టోర్డ్మీట్), మదర్స్ డిలైట్ (సోయానూనె) అనే నాలుగు బ్రాండ్లు ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,500 కోట్ల టర్నోవర్ వచ్చింది. మేం ఏటా 5–8 శాతం గ్రోత్సాధిస్తున్నాం. మేం ప్రపంచంలోనే తొమ్మిదో అతిపెద్ద బ్రాయిలర్ ఉత్పత్తిదారులం. మా రైతుల పౌల్ట్రీఫారాల్లో కోళ్ల ఆరోగ్యం కోసం లేటెస్ట్ టెక్నాలజీలను వాడుతున్నాం. స్మార్ట్ఫోన్ నుంచే ఫారాన్ని కంట్రోల్ చేయడానికి యాప్ను తీసుకొచ్చాం. అయితే దాణాకు వాడే మక్కలు, సోయా ధరలు పెరగడం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారు. నష్టాలు వస్తున్నాయి. మనదేశంలో చికెన్, గుడ్ల వాడకం చాలా తక్కువగా ఉంది. మాంసం ఎక్కువ తింటే హాని జరుగుతుందనే అపోహలు ఉన్నాయి. రైతుల లాభదాయకత, ఉత్పత్తిని పెంచడానికి మేం వారికి శిక్షణ ఇస్తున్నాం. సర్టిఫికెట్ కోర్సుల కోసం మేం తమిళనాడులోని పొల్లాచిలో స్పైషలైజ్డ్ పౌల్ట్రీ ఇన్స్టిట్యూట్ను కూడా నడుపుతున్నాం” అని మురళి వివరించారు.