నిజామాబాద్లో భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. సౌమ్య తన భర్త పల్లటి రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం.. ప్రియుడు దిలీప్తో కలిసి పక్కాగా ప్లాన్ చేసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం.. ఆ పై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేసినట్లు తేలింది. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గుండె పోటు అని ఈ హత్యను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్త గొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్గా నమ్మించారు. అయితే చనిపోయిన పల్లటి రమేష్ తమ్ముడి ఫిర్యాదుతో శవానికి పోస్టు మార్టం నిర్వహించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన భర్తను ప్రియుడితో కలిసి చంపినట్లు సౌమ్య ఒప్పుకుంది.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోర్గాం(కే) గ్రామానికి చెందిన పల్లాటి రమేశ్(35), ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా.. అతని భార్య సౌమ్య అలియాస్ అరుణలత ఓ ప్రైవేట్ స్కూల్లో క్లర్క్ గా చేస్తుంది. వీరికి పిల్లలు లేరు. అదే స్కూల్లో పీఈటీగా చేసే నందిపేట మండలం బాద్గుణ గ్రామానికి చెందిన నాళేశ్వరం దిలీప్తో ఆమెకు రెండేండ్ల కింద వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది రమేశ్కు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించు కోవాలని ప్రియుడు దిలీప్ను సౌమ్య కోరింది. అతడు వరుసకు తమ్ముడైన మాదాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అభిషేక్ సాయం కోరాడు.
గత ఆగస్టు12న బైక్ పై వెళ్లే రమేశ్ను అభిషేక్ కారుతో ఢీకొట్టి పారిపోయాడు. కాగా.. రమేశ్చేయి విరిగింది. మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్టు కేసు నమోదు చేశారు. అనంతరం అభిషేక్ తన ఫ్రెండ్ బంటు జితేందర్ను దిలీప్కు పరిచయం చేశాడు. సుపారి గ్యాంగ్తో మర్డర్ చేయిస్తానని చెప్పి ప్లాన్ చేశాడు. కిసాన్ నగర్ తండాకు చెందిన కేలోత్ శ్రీరామ్ అలియాస్ బబ్లూ, రమావత్ రాకేశ్, దూదేకుల మోసిన్లతో రూ.35 వేలకు డీల్ కుదుర్చు కున్నారు.
ALSO READ : ఆమె శవం మీద దొరికిన ఆమ్లెట్ ముక్కతో మర్డర్ మిస్టరీ సాల్వ్..
సౌమ్యకు చెప్పగా తన గోల్డ్ రింగ్ను దిలీప్కు ఇవ్వగా ఫైనాన్స్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి సుపారి గ్యాంగ్కు ఇచ్చాడు. గత డిసెంబర్19న రాత్రి రమేశ్ అన్నం తిన్న తర్వాత నిద్ర మాత్రలు కలిపిన మంచినీటిని భర్తకు సౌమ్య ఇవ్వగా తాగిన అతడు గాఢ నిద్రలోకి వెళ్లాక ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. అతను సుపారి గ్యాంగ్కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో అభిషేక్ తో పాటు దిలీప్ బైక్పై వెళ్లారు. నిద్రపోయిన రమేశ్మెడకు టవల్చుట్టి, ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం బైక్పై వెళ్లిపోయారు.
మరుసటి రోజు ఉదయం తన భర్త గుండెపోటులో చనిపోయాడని సౌమ్య బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. అదేరోజు అంత్యక్రియలు పూర్తి చేసింది. అయితే.. ఉపాధి కోసం ఇజ్రాయెల్కు వెళ్లిన రమేశ్ తమ్ముడు కేదారికి అంత్యక్రియల వీడియోలు, ఫొటోలు పంపారు. అన్న మెడకు గాయాలు ఉండడం చూసి అనుమానించి మాక్లూర్ పోలీసులకు రమేష్ తమ్ముడి కేదారి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
బోర్గాం (కే)లోనే ఉండే తన భార్య అనూషతో కేదారి పోలీసులకు ఫిర్యాదు చేయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత డిసెంబర్ 24న తహసీల్దార్ సమక్షంలో డెడ్బాడీ వెలికి తీయించి పోస్టుమార్టం చేయించగా హత్య చేసినట్టు తేలింది. సౌమ్యతో పాటు ఆమె ప్రియుడు దిలీప్, అభిషేక్, బంటు జితేందర్, కేలోత్ శ్రీరామ్, రమావత్ రాకేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
