
న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ ఏటీపీ ర్యాంకింగ్స్లో ఏకంగా 18 స్థానాలు మెరుగయ్యాడు. సోమవారం విడుదలైన తాజా జాబితాలో 77వ ర్యాంక్ అందుకున్నాడు. దాంతో మెన్స్ సింగిల్స్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాడు. సుమిత్ ఖాతాలో ప్రస్తుతం 713 ఏటీపీ పాయింట్లు ఉనాయి. ఆదివారం నెకర్కప్ టైటిల్ నెగ్గడంతో అతని ర్యాంక్ మెరుగైంది. ఒలింపిక్స్ అర్హతకు ప్రస్తుత ప్రమాణాల ప్రకారం మెన్స్, విమెన్స్లో టాప్–56 ప్లేయర్లు నేరుగా క్వాలిఫై అవుతారు.
అయితే, ఒక దేశం నుంచి నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన కారణంగా తక్కువ ర్యాంక్ ప్లేయర్లకు కూడా ఒలింపిక్స్ ఆడే చాన్స్ లభిస్తుంది. తన ర్యాంక్ దృష్ట్యా నగాల్ ఒలింపిక్స్ మెయిన్ డ్రా చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా నుంచి చివరగా 2012 ఒలింపిక్స్ మెయిన్ డ్రాలో సోమ్దేవ్ దేవ్వర్మన్ వైల్డ్ కార్డ్తో పోటీ పడ్డాడు.
నయా నంబర్ వన్ సినర్
ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సినర్ మెన్స్ సింగిల్స్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు. సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ను వెనక్కునెట్టి ఏటీపీ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్ సాధించాడు. దాంతో 1973తో ఏటీపీ ర్యాంక్లను కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఇటలీ నుంచి నం.1 ర్యాంక్ అందుకున్న తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. జులై 1న మొదలయ్యే వింబుల్డన్లో టాప్ సీడ్గా బరిలోకి దిగనున్నాడు.
గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్స్లో వెనుదిరిగిన నొవాక్ తన టాప్ ర్యాంక్ కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఫైనల్ చేరిన సినర్ రెండో ప్లేస్ నుంచి టాప్లోకి వచ్చాడు. ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్ రెండో ప్లేస్కు చేరగా.. జ్వెరెవ్ నాలుగో ర్యాంక్ కాపాడుకున్నాడు.