ఎండలు సుర్రుమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నానికి మంట పుట్టిస్తున్నాయి ఎండలు. ఎండలకు తోడు ఉక్కబోత, వేడిగాలులు పరేషాన్ చేస్తున్నాయి. వర్షాలు పడేంత వరకు ….ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరో నాలుగు రోజుల్లో రోహిణి కార్తె మొదలు కానుండటంతో ...రోకళ్లు పగిలే ఎండలకు జనం బేజారవుతున్నారు. ఎండల తీవ్రత చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఎండల ప్రభావం మరింతగా ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు వడగాలులతో జనం అవస్థలు పడుతున్నారు. మండుతున్న ఎండలు కూలీ పనులు చేసుకునే వారికి ఇబ్బందిగా మారాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజులుగా జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ జిల్లాలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలకు తోడు వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు.