- ఆకాశాన్నంటుతున్న ధరలు లీటర్ సన్ఫ్లవర్
- ఆయిల్పై రూ. 30.. పామాయిల్పై రూ. 20 పెంపు
- అదను చూసి గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా
- సిలిండర్ల కృత్రిమ కొరత
- కమర్షియల్తోపాటు డొమెస్టిక్ సిలిండర్లనూ బ్లాక్చేస్తున్న కిందిస్థాయి సిబ్బంది
- ఒక్కో సిలిండర్పై రూ. వెయ్యి నుంచి
- రూ. 1500 అదనంగా వసూలు
హైదరాబాద్, వెలుగు:
నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. ఒకవైపు వంటగ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా, మరోవైపు వంటనూనెల ధరల సెగతో సగటు మనిషి బతుకు ఛిద్రమవుతున్నది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడంతో, అటు వంటగది బడ్జెట్ అస్తవ్యస్తమవుతున్నది. ఒకవైపు డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా తీవ్రంగా ఆటంకాలు ఎదుర్కొంటుండగా, మరోవైపు యుద్ధ ప్రభావంతో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల కింది స్థాయి సిబ్బంది, ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లోకి మళ్లించి వేలకు వేలు అదనపు ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు, చిన్నా చితక హోటళ్లు, హాస్టళ్లు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్యాస్ ఏజెన్సీలు, సిబ్బంది అక్రమదందా!
రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడటాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమ సంపాదనకు తెరలేపారు. డొమెస్టిక్ (14.2 కేజీలు) సిలిండర్ అధికారిక ధర సుమారు రూ. 965 ఉండగా, బ్లాక్ మార్కెట్లో రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రూ. 2,106 ఉండాల్సిన ధరను ఏకంగా రూ. 4,000 నుంచి రూ. 6,500 వరకు పెంచి విక్రయిస్తున్నారు. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా డెలివరీ కావడం లేదు. తీరా చూస్తే, సిలిండర్ డెలివరీ అయినట్లు మొబైల్కు మెసేజ్లు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు.
గోదాముల నుంచే సిలిండర్లను నేరుగా బ్లాక్ మార్కెట్కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కమర్షియల్ సిలిండర్ల ధరలపై ప్రశ్నిస్తే అసలు గ్యాస్ సరఫరా చేయలేమని బెదిరిస్తున్నారని హోటల్ వ్యాపా రులు అంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల కోసం ఏజెన్సీలను, ఏజెన్సీ సిబ్బందిని బతిమిలాడుకోవాల్సి వస్తున్నదని, రెట్టింపు ధర వసూలు చేస్తున్నారని చెబుతు న్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం తెలిపి న వివరాల ప్రకారం.. బుకింగ్లు సాధారణ స్థాయి కంటే 250-, 300 శాతం పెరిగాయి.. కానీ డెలివరీలు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వం ‘సరఫరా సాధార ణంగా ఉంది’ అని ప్రకటించినా, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తో గ్యాస్ దిగుమతిలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫలి తంగా హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్స్టాక్ లేక వంటలను తగ్గించుకుంటున్నాయి. రోజువారీ ఖర్చు రూ.30 వేలు, 50వేల నుంచి రూ. లక్ష వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ధర లు పెంచడంతోపాటు నాణ్యత తగ్గించడంతో ప్రజలపై ఎఫెక్ట్ పడుతున్నది. కాగా, ఓటీపీ ఆధారిత డెలివరీలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
భగ్గుమంటున్న వంట నూనెలు
రాష్ట్రంలో వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ మూసివేత, రెడ్ సీ, సూయజ్ కాలువ ప్రాంతాల్లో అంతరాయాలు, బ్లాక్ సీ షిప్పింగ్ సమస్యలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర గతంలో రూ.152-–155 ఉండగా.. ప్రస్తుతం రూ.170- నుంచి 180కి చేరుకున్నది. హైదరాబాద్లో ఆన్లైన్లో రూ.174- నుంచి 178, రిటైల్లో రూ.170 నుంచి- 175 వరకు విక్రయిస్తున్నారు.
పామాయిల్ ధర లీటర్కు రూ.10 నుంచి -20 పెరగ్గా రూ.140- నుంచి 145కి చేరింది. మార్చి నెలలోనే ఎడిబుల్ ఆయిల్స్ ధరలు లీటర్కు రూ.11- నుంచి రూ. 20 పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దేశంలో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఫిబ్రవరి 2026లో 51 శాతం తగ్గాయి. రష్యా-–ఉక్రెయిన్ నుంచి 70- నుంచి 90 శాతం సరఫరా వస్తుండగా, యుద్ధ ప్రభావాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వంట నూనెల ధరల ప్రభావంతో సాధారణ కుటుంబాలపై అదనపు భారం పడుతున్నది. దీంతో ఒక్కో కుటుంబం నెలవారీ ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో చిన్న హోటళ్లు ధరలు పెంచడం, నాణ్యత తగ్గించడంలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా సిలిండర్లు, నూనెల ధరల పెరుగుదలతో సామాన్యుడి వంటగది నిర్వహణ భారంగా మారింది.
- ఓటీపీ వచ్చింది.. గ్యాస్ రాలే..
గ్యాస్ బుక్ చేసిన నెల తర్వాత ఓటీపీ వచ్చింది.. ఆ వెంటనే డెలీవరీ అయినట్టు మెజేస్ వచ్చింది. గ్యాస్ సిలిండర్ మాత్రంరాలేదు. గ్యాస్ఏజెన్సీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే 2 రోజులకు గ్యాస్ సరఫరా చేశారు. ఎందుకు వేరే వారికి సరఫరా చేశారని సిబ్బందిని నిలదీస్తే.. ‘మీకు అంత అర్జెంట్ అయితే మాకు ఫోన్ చేస్తరు కదా’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
- ఎంవీ రమణి, గృహిణి, హబ్సిగూడ
- వంట నూనెల ధరలు భారం..
వంట నూనెల ధరలు రోజురోజుకూ పెరగు తుండడంతో ఇంటి బడ్జెట్ కుదేలైంది. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.175 నుంచి 180కి చేరడం, 2 లీటర్ల బాటిల్ రూ.350 దాటడం భారంగా మారింది. పామాయిల్ ధర అధికంగా ఉండ డంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. వంటలో నూనె తగ్గించుకోవాల్సి వస్తున్నది. నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 అదనపు భారం పడు తున్నది. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి.
- అచ్చన రాజేశ్వరి, గృహిణి, రామంతాపూర్
