పంజాబ్‌‌లో దారుణం.. కూతుర్ని చంపి బాడీని ఈడ్చుకెళ్లాడు

పంజాబ్‌‌లో దారుణం.. కూతుర్ని చంపి బాడీని ఈడ్చుకెళ్లాడు

న్యూఢిల్లీ: పంజాబ్‌‌లో దారుణం జరిగింది.  ఓ వ్యక్తి తన కన్న కూతురిని చంపేసి, ఆపై ఆమె డెడ్ బాడీని తన బైక్ కు కట్టుకుని ఊర్లోని రోడ్లపై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన అమృత్‌‌సర్‌‌లోని జండియాలా సిటీకి సమీపంలో ఉన్న ముచ్చల్ గ్రామంలో చోటుచేసుకుంది. ముచ్చల్ లో నివసించే దల్బీర్ సింగ్ అలియాస్ బావుకు సుమన్‌‌దీప్ కౌర్(20) అనే కూతురు ఉంది. బుధవారం ఆమె ఎవరికీ చెప్పకుండా  ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా సుమన్‌‌ దీప్‌‌ కౌర్‌‌ ఆచూకీ తెలియలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. దీంతో కూతురిపై దల్బీర్ సింగ్ మండిపడ్డాడు. ఆ కోపంలో ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. సుమన్‌‌దీప్ డెడ్ బాడీని బైక్​కు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఆపై డెడ్ బాడీని రైల్వే ట్రాక్‌‌పై విసిరేసి పరారయ్యాడు. గ్రామస్తుల సమాచారంతో  పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.