- ఏప్రిల్ 30న వాదనలు వింటామన్న కోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని విద్యుత్ కేంద్రాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకు రావాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 2021లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి కరెంట్ను ఉత్పత్తి చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వం.. అదే ఏడాది జులైలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పిటిషన్లో ఆరోపించింది.
దీంతో ప్రాజక్టుల్లోని నీటి వాటా వినియోగంలో తేడాలు వస్తున్నాయని పేర్కొంది. ఈ పిటిషన్పై గతంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెంచ్.. కేంద్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కో సీఎండీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ పిటిషన్ మరోసారి మంగళవారం జస్టిస్ అభయ్ ఎస్.ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల బెంచ్ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉందని తెలంగాణ తరఫు సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ అన్నారు. విచారణ వాయిదా వేసే ఉద్దేశం ఉంటే తాము వాదనలకు సిద్ధమని ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్ ఉమాపతి పేర్కొన్నారు. స్పందించిన బెంచ్.. ఏప్రిల్ 30న తుది వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.