గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసును ముగించిన సుప్రీం కోర్టు

గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసును ముగించిన సుప్రీం కోర్టు

తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివరణ కోసం గవర్నర్ కు  బిల్లులు తిప్పి పంపే అధికారం ఉందన్న సుప్రీం కోర్టు ..  వీలైనంత త్వరగా బిల్లులపై  నిర్ణయాలు తీసుకోవాలని  సూచించింది.  ప్రస్తుతానికి బిల్లులు పెండింగ్ లో లేనందున ఈ కేసును ముగిస్తున్నట్లు తెలిపింది. 

విచారణ సందర్భంగా గవర్నర్ దగ్గర  ఎటువంటి  బిల్లులు పెండింగ్ లో లేవని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. రెండు బిల్లుల విషయంలో  ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ కోరినట్లు చెప్పారు. అయితే  గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారాపడాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. పెండింగ్ బిల్లులను ఎక్కువ కాలం గవర్నర్ తన దగ్గరే పెట్టుకోవడం కరెక్ట్ కాదని కోర్టుకు తెలిపారు.

 మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బిల్లులు త్వరగా పరిష్కారం అవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే . నిర్ణీత కాల వ్యవధిలో బిల్లులు ఆమోదించేలా  ఆదేశాలివ్వాలంటూ  తెలిపారు.  ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రస్తుతం బిల్లులు పెండింగ్ లో లేనందున  కేసు విచారణను ముగిస్తున్నామని చెప్పింది.