చీతాల మృతిపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..

చీతాల మృతిపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..

కునో నేషనల్ పార్కులో చీతాల మృతిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. విదేశాల నుంచి భారత్కు చీతాలను తీసుకొస్తున్న విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టేందుకు ఎలాంటి కారణాలు లేవని స్పష్టం చేసింది. ప్రాజెక్టు చీతా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు సమర్థించింది. 

ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకొచ్చిన 20 చీతాల్లో ఆరు చీతాలు, మూడు చీతాకూనలు మృతి చెందాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై  విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం..ప్రాజెక్టు చీతా అంశంలో  కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థించింది. ఈ  పిటిషన్ కొట్టివేసింది.

1952 తర్వాత భారత్లో చీతాలు అంతరించిపోయినట్లు ప్రకటించిన కేంద్రం...2022 సెప్టెంబర్లో  ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. ఇందులో భాగంగా రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుండి 20 చీతాలను మధ్యప్రదేశ్లోనే కునో నేషనల్ పార్కులో వదిలిపెట్టింది. అయితే నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మార్చి 27న, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే మగ చీతా ఏప్రిల్ 23న మృతి చెందాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా దక్ష మే 9న మృతి చెందింది. అదే నెలలో జ్వాలా అనే చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో  మూడు చనిపోయాయి. ఈ నెలలో మరో  మూడు  చీతాలు చనిపోవడంతో వీటి మరణాల 9 కి చేరింది.

కునో నేషనల్ పార్కులో చీతాల కదలికలను గుర్తించేందుకు వాటి మెడలో వేసిన రేడియో కాలర్ల వల్లే అవి మృతి చెందుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో  వాటిని కూడా తొలగించారు. అయినా ఇటీవల మరో చీతా మృతి చెందింది. ఈ క్రమంలో చీతాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని..కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  చీతాలను భారత్లో తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం సమర్ధించింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది. 

అయితే ప్రాజెక్టు చీతాకు సంబంధించి తీవ్ర కసరత్తు చేశామని..ఇందులో భాగంగా  ప్రతి ఏడాది 12 నుంచి -14 చీతాలను భారత్  తీసుకొచ్చేందుకు ప్రణాలికలు రచించామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. ఈ మేరకు ఆయా దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితుల  చీతాలకు కొన్ని సమస్యలు వస్తున్నాయని..వాటని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.