- తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు విచారణ చేపట్టొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: మార్గదర్శి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. మార్గదర్శి కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ మార్గదర్శి సంస్థ సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఈ పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ల బెంచ్ విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఈలోగా మరికొన్ని కేసులు నమోదు చేసి ఏపీ హైకోర్టులో విచారణ జరుపుతున్నారన్నారు. కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్లో జరిగినట్లు ఉందని, అందుకే అన్ని కేసుల విచారణ ఒకేచోట జరగాలని నివేదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ నిలిపివేయాలని చెప్పింది. ఫిబ్రవరి 2లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, సీఐడీని ఆదేశించింది.