న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను యుద్ధ క్షేత్రాలుగా వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణ నుంచి వచ్చే కేసులు ఈ కోవకు చెందినవిగా ఉంటున్నాయని పేర్కొంది. మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితులు రామచంద్ర భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ... నిందితుల బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్నదన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ విశ్వనాథన్.. పార్టీ వేసిన పిటిషన్ కు, తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. పార్టీల ఆందోళనలను తాము కంట్రోల్ చేయలేమని నివేదించారు. నిందితుడి హక్కుల కోసమే హైకోర్టులో వాదనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న బెంచ్.. ‘‘కొన్ని సందర్భాల్లో ఏపీ, తెలంగాణ నుంచి వస్తున్న కేసుల్లో రాజకీయ వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. కోర్టులను రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధ క్షేత్రాలుగా మార్చుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.