బిచ్చగాళ్ల వ్యాక్సినేషన్ పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

బిచ్చగాళ్ల వ్యాక్సినేషన్ పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

కరోనా క్యారియర్లుగా ఉన్న వారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని.. వారికి వ్యాక్సినేషన్ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా వైరస్ థర్డ్ వేవ్ రాకముందే బిచ్చగాళ్లకు వ్యాక్సినేషన్ చేయించాలని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించారు కుష్ కర్లా అనే వ్యక్తి. కుష్ కర్లా తరపున మోహిత్ పాల్ అనే లాయర్ ఈ పిటిషన్ వేశారు.

మూడో వేవ్ వస్తే కరోనా వైరస్ మరింత తీవ్రం అయ్యే పరిస్థితి ఉండగా.. బిచ్చగాళ్ళు, వీధివాసులకు పునరావాసం కల్పించాలని, వ్యాక్సిన్‌లను వేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వాని నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో సహాయం చేయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరిన అత్యున్నత న్యాయస్థానం, ఇది ఒక సామాజిక-ఆర్థిక సమస్య కనుక ఏ బిచ్చగాడిని వీధుల్లోకి అనుమతించకూడదనే అభిప్రాయాన్ని తీసుకోలేమని స్పష్టం చేశారు.

జస్టిస్ డివై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విద్య, ఉపాధి లేకపోవడంతో ప్రజలు సాధారణంగా కొంత ప్రాధమిక జీవనోపాధి కోసం వీధుల్లో అడుక్కునే పరిస్థితి వస్తోందని తెలిపింది. అయితే.. బిచ్చగాళ్ళు, వీధివాసుల పునరావాసం, వారికి వ్యాక్సిన్‌లు వేయడం గురించి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని, ఈ విజ్ఞప్తిపై రెండు వారాల్లోగా స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని నోటీసులు ఇచ్చింది.