
- మధ్యంతర ఉత్తర్వులను అలుసుగా తీసుకోవద్దని సూచన
- తదుపరి విచారణ వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు
న్యూఢిల్లీ, వెలుగు: పాస్ పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు విచారణకు హాజరుకావాలని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు సూచించింది. అన్ని విధాలుగా విచారణకు సహకరించాలని ఆదేశించింది. కోర్టు కల్పిస్తున్న ఈ మధ్యంతర వెసులుబాటును అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించింది. అలాగే, భారతదేశానికి మాత్రమే ప్రయాణించడానికి పాస్పోర్ట్/ట్రావెల్ డాక్యుమెంట్ను ప్రభాకర్ రావుకు చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్/ కాంపిటెంట్ అథారిటీ ద్వారా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభాకర్ రావును టార్గెట్చేశారు
ఫోన్ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 2న నిరాకరించింది. దీంతో ఈ నెల 9న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తొలుత పిటిషనర్ తరఫున దామా శేషాద్రి వాదనలు వినిపించారు. గత విచారణ సందర్భంగా ప్రభాకర్ రావును ఇండియాకు రానిద్దామని, విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కోర్టు వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. అసలు ఇది కేసే కాదని... కేవలం కక్ష సాధింపులో భాగంగా కొందరు పొలిటికల్ లీడర్లు టార్గెట్ గా ప్రస్తుత సీఎం ఈ కేసుతో వెంటాడుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రావు పరారీలో ఉన్నందున ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించాలని ప్రభుత్వం కోరిందన్నారు. ఆయన పాస్ పోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని.. కోర్టు ప్రత్యేక అనుమతులు కల్పిస్తే వెనక్కి వచ్చేందుకు ప్రభాకర్ రావు సిద్ధంగా ఉన్నారని శేషాద్రి తెలిపారు.
కేసును రాజకీయ కోణంలో చూడొద్దు
దామా శేషాద్రి వాదనలపై ప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారని, కేసును రాజకీయ కోణంలో చూడొద్దని, క్రైం సీరియస్ నెస్ ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు కోరారు. చట్ట ప్రకారం ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభాకర్ రావు ఇండియా వచ్చేందుకు పాస్ పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. పాస్ పోర్ట్ అందిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి, దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అంతవరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే విచారిస్తాం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నాన్ బెయిలబుల్ వారెంట్, డిపోర్టేషన్సహా అన్ని చర్యలు నిలిపివేస్తం. ప్రభాకర్రావును విచారించేందుకు దర్యాప్తు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. - సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ