
నిరసనలు తెలపొచ్చు కానీ.. సిటీని బ్లాక్ చేస్తే ఎట్ల?
ఢిల్లీ బార్డర్లో ఆందోళన చేస్తున్న రైతులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
మీ రైట్స్ కోసం ఇతరుల హక్కులు కాలరాయొద్దు
రైతులు ప్రభుత్వంతో చర్చించాలి.. సమస్యలు పరిష్కరించుకోవాలి
కేంద్రం కూడా అగ్రి చట్టాల అమలు నిలిపేయాలని సూచన
చట్టాలను ఆపేస్తే రైతులు చర్చలకు రారని ఏజీ కామెంట్
అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులిస్తామన్న బెంచ్
వెకేషన్ బెంచ్కు విచారణ ట్రాన్స్ఫర్
న్యూఢిల్లీ: ‘‘శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉంది. కానీ చర్చలు జరపకుండా ప్రొటెస్టులు చేస్తూ ఉండకూడదు. ప్రభుత్వంతో మాట్లాడకుండా.. ఏండ్లపాటు నిరసనల్లో కూర్చుంటామంటే కుదరదు. మీ (రైతులు) ప్రొటెస్టులకు ఓ ఉద్దేశం ఉండాలి. మీరు ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ప్రస్తుతం చర్చలు జరగడం లేదని కేంద్రం, రైతు సంఘాలు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వేచ్ఛగా వెళ్లేందుకు, అవసరమైన ఆహారం తెచ్చుకునేందుకు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను.. నిరసన తెలిపే హక్కు పేరుతో రైతులు ఉల్లంఘించొద్దని స్పష్టం చేసింది. రైట్ టు ప్రొటెస్ట్ అంటే.. మొత్తం సిటీని బ్లాక్ చేయడం కాదని కామెంట్స్ చేసింది. ఢిల్లీ బార్డర్లలో నిరసనలు తెలుపుతున్న రైతులను అక్కడి నుంచి పంపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన బెంచ్ గురువారం విచారణ జరిపింది. నిరసన తెలుపుతున్న రైతు సంఘాలతో సహా అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేస్తామని బెంచ్ స్పష్టం చేసింది.
మేం ఆందోళన పడుతున్నం
‘‘ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును మేం గుర్తించాం. కానీ ప్రొటెస్టుల వల్ల ఎవరి ప్రాణానికి, ఆస్తికి హాని కలగకూడదు” అని సుప్రీంకోర్టు చెప్పింది. ‘‘రైతుల దుస్థితిపై మేం ఆందోళన పడుతున్నాం. వారి విషయంలో సానుభూతితో ఉన్నాం. కాని వాళ్లు దారి మార్చాలి. ఒప్పించి, పరిష్కారాన్ని తీసుకురావాలి” అని కామెంట్ చేసింది. ‘‘నిరసనల ఉద్దేశాలు అహింసా మార్గాల ద్వారానే నెరవేరాలి. సమస్యల పరిష్కారం కోసమే ప్రొటెస్టులు జరగాలి. బాధిత పక్షాలు తమ భావ ప్రకటనకు అనుమతించాలి. అలాగే సమస్యకు కారణమైన పక్షం కూడా సమాధానం ఇవ్వడానికి అనుమతించాలి” అని చెప్పింది. నిరసన తెలుపుతున్న రైతు సంఘాలకు నోటీసులిచ్చేందుకు తాము ఉత్తర్వులు జారీ చేస్తామని, వింటర్ బ్రేక్లో వెకేషన్ బెంచ్ను సంప్రదించేందుకు వారికి స్వేచ్ఛ ఇస్తామని తెలిపింది. పిటిషన్ల విచారణను వెకేషన్ బెంచ్కు పంపుతామని చెప్పింది.
అట్ల చేస్తే రైతులు చర్చలకు రారు..
సమస్యలను పరిష్కరించేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర ప్యానెల్ను ఏర్పాటు చేయాలని తాము అనుకుంటున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు, పి.సాయినాథ్ వంటి ఎక్స్పర్టులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. కొత్త వ్యవసాయ చట్టాలు అమలు చేయడాన్ని కేంద్రం నిలిపివేస్తే రైతులతో చర్చలు జరపవచ్చని చెప్పింది. అయితే సుప్రీం సూచనను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వ్యతిరేకించారు. ఇప్పుడు తాము అగ్రి చట్టాల అమలును ఆపేస్తే.. రైతులు తమతో చర్చలు జరిపేందుకు రారని వివరించారు. స్పందించిన బెంచ్.. అగ్రి చట్టాలను ఆపేయాలని తాము అడగటం లేదని, అమలును మాత్రమే కొన్నాళ్లు నిలపాలని సూచిస్తున్నామని చెప్పింది.
హింసకు పాల్పడితే..?
‘‘అంత భారీ సంఖ్యలో రైతులు సిటీలోకి వస్తే హింసకు పాల్పడరని ఎవరు గ్యారంటీ ఇస్తారు? కోర్టు దీనికి గ్యారంటీ ఇవ్వదు. హింసను నివారించే సాధనాలు కోర్టు దగ్గర ఉండవు. ఇతరుల హక్కులను కాపాడే పోలీసులు, అధికారుల వద్ద అలాంటి సాధనాలు ఉంటాయి’’ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సందర్భంగా 1988లో ఢిల్లీలో రైతులు జరిపిన బోట్ క్లబ్ నిరసనను కోర్టు ప్రస్తావించింది.
టిక్రిలో మరో రైతు మృతి..
పంజాబ్కు చెందిన 38 ఏళ్ల రైతు జై సింగ్.. టిక్రి బార్డర్లో చనిపోయాడు. బతిండా జిల్లా తుంగ్వలి కి చెందిన జై సింగ్.. తన బ్రదర్తో కలిసి కొన్ని రోజులుగా నిరసనల్లో పాల్గొంటు గురువారం ఉదయం చనిపోయాడని, మృతికి కారణమేంటో ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. హార్ట్ ఎటాక్ వల్ల జై చనిపోయి ఉండొచ్చని అతడి బ్రదర్ తెలిపాడు. ఢిల్లీ బార్డర్లో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న రైతుల్లో ఇప్పటిదాకా 20 మంది దాకా చనిపోయారు.
For More News..