రోడ్లను బ్లాక్ చేసే హక్కు ఎవరికీ లేదు

రోడ్లను బ్లాక్ చేసే హక్కు ఎవరికీ లేదు

న్యూఢిల్లీ: నిరసనల పేరుతో రోడ్లను బ్లాక్ చేసే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో అన్నదాతలు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనల వల్ల పలుమార్లు ఢిల్లీలో రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు క్యాంప్ వేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల బ్లాకేజీ వల్ల ప్రజల రోజువారీ కార్యకలాపాలు, ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ అనే మహిళ సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. రైతుల సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలన్న కోర్టు.. వారికి నిరసనలు తెలిపే హక్కుందని స్పష్టం చేసింది. కానీ రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని పేర్కొంది. ఇతర పద్ధతుల్లో నిరసనలను తెలుపుకోవచ్చని.. రోడ్లను బ్లాక్ చేయొద్దని జస్టిస్ ఎస్‌కే కౌల్, ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంపై మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ వేయాలని రైతు సంఘాలను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తల కోసం: 

లైగర్ నటి అనన్య పాండే ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

గర్ల్​ ఫ్రెండ్​ లేదంటే భార్య ఉండాల్సిందే..!

గిఫ్టులను పాక్ ప్రధాని అమ్ముకుంటున్నారా?