- మీ యాడ్స్సైజులోనే క్షమాపణ ప్రకటన ఇవ్వండి
- తప్పుడు ప్రకటనల కేసులో పతంజలికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద తప్పుడు ప్రకటనల కేసులో బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘న్యూస్ పేపర్లలో ఇచ్చిన క్షమాపణ ప్రకటనను మీ కంపెనీ యాడ్స్ సైజులో ఇచ్చారా?’ అని ప్రశ్నించింది. కోర్టు ఎదుట తాజా క్షమాపణ ప్రకటనలు ఉంచినట్టు పతంజలి తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీ మంగళవారం కోర్టుకు తెలిపారు. క్షమాపణల ప్రకటనలను నిన్ననే ఎందుకు ఇచ్చారని, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదని ధర్మాసనం ప్రశ్నించింది. రూ.10 లక్షలు ఖర్చుపెట్టి 67 న్యూస్ పేపర్లలో ఈ ప్రకటన ఇచ్చినట్టు రోహిత్గీ కోర్టుకు తెలిపారు. ‘మీ క్షమాపణ ప్రకటన ప్రముఖంగా ప్రకటన ఇచ్చారా? ఇంతకుముందు మీ కంపెనీ యాడ్ సైజులో ఉందా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ఇందుకోసం ఎన్ని లక్షలు ఖర్చుపెట్టినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. అలాగే, పతంజలికి వ్యతిరేకంగా కేసు పెట్టినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు రూ. 1000 కోట్ల ఫైన్ వెయ్యాలని దాఖలైన అప్లికేషన్ను స్వీకరించినట్టు కోర్టు తెలిపింది. ‘ఇది కుట్రపూరిత అభ్యర్థన కాదా? మేం దీన్ని అనుమానిస్తున్నాం’ అని కోర్టు పేర్కొన్నది. అయితే, ఈ అప్లికేషన్తో బాబా రాందేవ్కుగానీ, బాలకృష్ణకుగానీ ఎలాంటి సంబంధం లేదని రోహిత్గీ తెలిపారు. అనంతరం న్యూస్పేపర్లలో పెద్ద సైజులో క్షమాపణ ప్రకటన ఇస్తామని బాబా రాందేవ్ చెప్పడంతో కోర్టు విచారణను వారానికి వాయిదా వేసింది.
ప్రింట్ కాపీలను సమర్పించండి
క్షమాపణ యాడ్స్ సైజును కొలిచేందుకు ప్రింట్ అయిన కాపీలను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం పతంజలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. యాడ్స్ను కట్చేసి తమకివ్వాలని పేర్కొన్నది. ఆ యాడ్స్కు సంబంధించిన అసలు సైజును తాము చూడాలని అనుకుంటున్నామని, ఇది తమ ఆదేశమని పేర్కొన్నది. ప్రకటనలు భూతద్దంలో పెట్టి చూసేలా ఉండొద్దని, ఆ యాడ్స్చదివే రీతిలో ఉండాలని జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు.