జర్నలిస్ట్​ ప్రశాంత్ ను విడుదల చేయండి: సుప్రీం

జర్నలిస్ట్​ ప్రశాంత్ ను విడుదల చేయండి: సుప్రీం
  • అరెస్టేంది? విడిచిపెట్టండి
  • యూపీ పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశం
  • ‘యోగిపై పోస్ట్​’ కేసులో జర్నలిస్ట్​ కనోజియాకు బెయిల్
  • జడ్జిలకూ సోషల్ మీడియా సెగ తప్పడం లేదన్న బెంచ్

ఉత్తరప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​పై సోషల్​ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడన్న కేసులో నోయిడా జర్నలిస్ట్​ ప్రశాంత్ కనౌజియాను తక్షణమే విడిచిపెట్టాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు ఏ రూల్స్​ ప్రకారం జర్నలిస్టును అరెస్టు చేశారంటూ యూపీ పోలీసులపై కోర్టు మండిపడింది. కనౌజియా భార్య జగీశా అరోరా దాఖలు చేసిన హెబియస్‌‌‌‌ కార్పస్ పిటిషన్​ను జస్టిస్​ ఇందిరా బెనర్జీ, జస్టిస్​ అజయ్​ రస్తోగీతో కూడిన వెకెషన్​ బెంచ్ మంగళవారం విచారించింది. అరెస్టును తప్పుపట్టిన జడ్జిలు, జర్నలిస్టుకు బెయిల్​ మంజూరు చేశారు. యూపీ సర్కార్​ తరఫున అడిషనల్​ సొలిసిటర్ జనరల్​ విక్రమ్​జిత్​ బెనర్జీ, పిటిషనర్​ తరఫున నిత్యా రామకృష్ణ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా,  రాజ్యాంగం పౌరులకు కల్పించిన వాక్​స్వాతంత్ర్యపు హక్కు చాలా పవిత్రమైనదని, దాని విషయంలో ఎలాంటి రాజీ ఉండదని జడ్జిలు స్పష్టం చేశారు.

ఆ పోస్టుల్ని సమర్థించం కానీ..

జర్నలిస్ట్​ కనౌజియాకు బెయిల్​ ఇచ్చినంత మాత్రాన సోషల్​ మీడియాలో ఆయన పెట్టిన పోస్టుల్ని కోర్టు సమర్థిస్తున్నట్లుగా భావించొద్దని బెంచ్​ పేర్కొంది. ‘‘మంచికో, చెడుకో జడ్జిలకు కూడా కొన్ని సార్లు సోషల్​ మీడియా సెగ తప్పట్లేదు. అలాంటి సందర్భాల్లో నిబంధనల ప్రకారం మన పని మనం చేసుకుపోవడం మంచింది. పౌరహక్కులపై స్పష్టమైన చట్టాలున్నాయి. ఒకరి స్వేచ్ఛా హక్కును హరించే అధికారం ఎవరికీ లేదు. దాన్ని కోర్టు కూడా అంగీకరించదు. ఆర్టికల్​ 32 ప్రకారం(నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ) దాఖలైన పిటిషన్​ విషయంలోనైనాసరే, స్వేచ్ఛా హక్కుకు భంగం వాటిల్లుతుంటే మేం చేతులు ముడుచుకొని కూర్చోలేం. ఈ కేసులో నిందితుణ్ని(కనౌజియాని) జ్యూడీషియల్​ కస్టడీ పేరుతో 11 రోజులు జైల్లో ఉంచడం కరెక్ట్​ కాదు. యూపీ పోలీసులు దర్యాప్తు కొనసాగించొచ్చు. కానీ అంతకంటే ముందు జర్నలిస్టును రిలీజ్​ చేయాలి”అని జడ్జిలు పేర్కొన్నారు.

సీఎం యోగిది మూర్ఖత్వం: రాహుల్

జర్నలిస్టుల విషయం యూపీ సీఎం ఆదిత్యనాథ్​ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​ గాంధీ విమర్శించారు. తప్పుడు వార్తలు, వ్యతిరేక ప్రచారం చేశారన్న అభియోగాలపై మీడియా ప్రతినిధుల్ని అరెస్టు చేయడం సరికాదన్నారు. ‘‘అలా బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ సపోర్టుతో నాపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాసే వాళ్లందర్నీ అరెస్టు చేసి జైళ్లలో పెడితే దేశంలో జర్నలిస్టుల కొరత ఏర్పడుతుంది”అని రాహుల్​ ట్వీట్​ చేశారు. సమస్యల్ని పట్టించుకోని యోగిసర్కార్‌‌ జర్నలిస్టుల్ని బెదిరించే పనిలో బిజీ అయిపోయిందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.

అసలేం జరిగింది?

ఇటీవల ఓ మహిళ.. సీఎం యోగి ఆదిత్యనాథ్​కు పెండ్లి ప్రపోజల్​ పంపానంటూ ఆయన ఇంటిముందే నిలబడి మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను నోయిడాకు చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనౌజియా ట్విటర్​, ఫేస్​బుక్​లో షేర్​ చేశారు. నేషనల్​ లైవ్​ అనే న్యూస్​ చానెల్​ కూడా సదరు వీడియోను టెలికాస్ట్​ చేసింది. సీఎం పరువుకు భంగంకల్గించేలా జర్నలిస్టులు వ్యవహరించారన్న బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు వేర్వేరుగా కేసులు నమోదు చేసిన యూపీ పోలీసులు శనివారం కనౌజియా, చానెల్​ యజమాని ఇషికా సింగ్‌‌‌‌, ఎడిటర్‌‌‌‌ అనుజ్‌‌‌‌ శుక్లాలను అరెస్టు చేశారు. దీనిపై మీడియా సంఘాలు, ఎడిటర్స్​ గిల్డ్‌‌​ ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కర్నాటక సీఎంపై వీడియో.. ఇద్దరి అరెస్ట్

స్వేచ్ఛా హక్కు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సందర్భంలో కర్నాటకలో ఇద్దరి అరెస్టు వ్యవహారం సంచలనంగా మారింది. లోక్​సభ ఎన్నికల్లో జేడీఎస్​ ఓటమిపై సిద్దరాజు, చామరాజు అనే ఇద్దరు యువకులు సెటైర్లతో కూడిన వీడియోను పోస్ట్​ చేశారు. అందులో సీఎం కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్​పై అభ్యంతరకర కామెంట్స్‌‌ ఉన్నాయని జేడీఎస్​ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరు యువకుల్ని శనివారం పోలీసులు అరెస్టు చేసి 15 రోజుల రిమాండ్​కు తరలించారు. యూపీ సీఎంపై కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​ కామెంట్స్​ని కోట్​ చేస్తూ బీజేపీ.. కర్నాటక సీఎంను టార్గెట్​ చేసింది. ‘‘కుమారస్వామి అన్నా, యాంటీ కామెంట్స్​ చేసినంత మాత్రాన పౌరుల్ని అరెస్టు చేయడం మూర్ఖత్వమని మీ ఫ్రెండ్​ రాహుల్​ గాంధీ చెప్పారు. కర్నాటకలో సర్కార్​ కూలిపోతుందన్న భయంతో ఆయన మీ పేరు చెప్పలేదు. దయచేసి మీ ఫ్రెండ్​ మాటలు ఆలకించండి’’అంటూ బీజేపీ సెటైర్​ వేసింది. సీఎం కుమారస్వామి ఓపెన్​గా జర్నలిస్టులకు వార్నింగ్​ ఇచ్చారని, టిప్పు సుల్తాన్​పై మాట్లాడినందుకు సంతోశ్ తమ్మయ్య అనే జర్నలిస్టును, నిఖిల్​ గౌడపై ఆర్టికల్​ రాసినందుకు విశ్వేశ్వర భట్​ అనే మరో విలేకరిపై కర్నాటక సర్కార్​ కేసులు పెట్టిందని బీజేపీ గుర్తుచేసింది.