కేసీఆర్​ ఫ్యామిలీనే బాగుపడ్డది :  ​ సుప్రియా శ్రీనటే

కేసీఆర్​ ఫ్యామిలీనే బాగుపడ్డది :  ​ సుప్రియా శ్రీనటే

హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో కేవలం కేసీఆర్​ కుటుంబం ఒక్కటే బాగుపడిందని, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ అభివృద్ధి చెందలేదని సీడబ్ల్యూసీ మెంబర్​ సుప్రియా శ్రీనటే అన్నారు.  సీఎం, మంత్రి పదవులు అన్ని వాళ్ల ఇంట్లో వాళ్లకే ఇచ్చుకున్నారని విమర్శించారు. శుక్రవారం ఆమె కాంగ్రెస్​ నేత గిరిజ షెట్కార్​తో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు వస్తాయని, రైతులు బాగుపడతారని, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని తెలంగాణ ఇస్తే.. వాళ్ల రాత ఇప్పటికీ మారలేదన్నారు.

కాంగ్రెస్​ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో  96 శాతం హామీలను నెరవేర్చామన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఫైరయ్యారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ఉచిత ఎరువులు, డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల వంటి హామీలనూ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క స్కూల్​ కట్టలేదన్నారు. సీఎం పదవి ఇస్తానని దళితులనూ కేసీఆర్​ మోసం చేశారన్నారు.     

గ్యారంటీలను అమలు చేస్తం

కర్నాటకలో కాంగ్రెస్​ సర్కారు ఏర్పడిన వెంటనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని, ఇక్కడా  ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సుప్రియ చెప్పారు. పిల్లల ఫీజులు కట్టలేక పేద, మధ్య తరగతి ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఇంటర్నేషనల్​ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీకి బీఆర్​ఎస్, ఎంఐఎంలు బీ టీమ్​లుగా పనిచేస్తున్నాయన్నారు. అన్ని చట్టాలు, బిల్లులకు బీజేపీకి బీఆర్​ఎస్​ మద్దతిచ్చిందని గుర్తు చేశారు.