కేసీఆర్ నేతన్నలను.. నమ్మించి మోసం చేసిండు: దాసు సురేశ్

కేసీఆర్ నేతన్నలను.. నమ్మించి మోసం చేసిండు: దాసు సురేశ్

నల్గొండ అర్బన్, వెలుగు: చేనేత వర్గాన్ని రాజకీయంగా అణచి వేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్​చెప్పారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్​లో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబ సభ్యులు దాసు సురేశ్ నేతృత్వంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్​ చేసిందేమీ లేదన్నారు. 

పదేండ్లుగా నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ చేనేతను పబ్లిసిటీకి వాడుకుంటున్నాడే తప్ప, ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గడిచిన పదేండ్లలో 400 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, కేటీఆర్​కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదన్నారు. 

బీఆర్ఎస్​హయాంలో చేనేత రంగం నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మగ్గాల చప్పుడు లేకుండా పోయిందని వాపోయారు. బాధితురాలు కొలను నిర్మల మాట్లాడుతూ.. తమకు పట్టిన గతే కేసీఆర్​బిడ్డ కవితకు పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. నేతన్నల బతుకులను రోడ్డున పడేసిన కేసీఆర్, కేటీఆర్ ను ఓడించే దాకా నిద్రపోమని మహిళలు హెచ్చరించారు. 

తమ ఉసురు తప్పక తగులుతుందన్నారు. అవసరమైతే సిరిసిల్ల, గజ్వేల్​లో నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షుడు దొంత ఆనందం, గ్రేటర్​హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మావతి, కార్మిక సంఘాల నాయకుడు గంజి నాగరాజు, బాధిత మహిళలు పాల్గొన్నారు.