సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ‘వీరభద్రుడు’ టైటిల్తో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈనెల 14న రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. అతిథిగా హాజరైన కార్తి మాట్లాడుతూ ‘ఇలాంటి క్యారెక్టర్ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది.
సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రమిది’ అని అన్నాడు. ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘డివైన్ ఎలిమెంట్తో పాటు సోషల్ యాంగిల్ను మిక్స్ చేసి ఆర్.జే. బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య గారితో ప్రస్తుతం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని రూపొందిస్తున్నా. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.
సూర్య మాట్లాడుతూ ‘ఆర్.జే. బాలాజీ ఈ కథను చాలా సిన్సియర్గా రాశారు. ఫస్ట్ హాఫ్ మంచి ఎమోషనల్ కోర్ట్రూమ్ డ్రామాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి మాస్ మసాలా మూమెంట్స్తో ఉంటుంది. అలాగే హ్యూమర్ కూడా ఉంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులు కచ్చితంగా సంతృప్తి పొందుతారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం’ అని చెప్పారు. డైరెక్టర్ ఆర్జే బాలాజీ మాట్లాడుతూ ‘ఇదొక ఇంటెలిజెంట్ కమర్షియల్ ఫిల్మ్. అభిమానులు చూడాలనుకునే సూర్య సార్ను ఈ సినిమాలో చూపించాం’ అని చెప్పాడు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, రైటర్ రాకేందు మౌళి పాల్గొన్నారు.
