- ఎస్హెచ్జీ, అగ్రికల్చర్ లోన్ల పేరుతో రూ.2.85 కోట్లు బదిలీ
- బంధువుల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసిన మేనేజర్
- ఆడిట్లో బయటపడ్డ నిజం
- 14మందిపై కేసు నమోదు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రూ.4.5 కోట్ల కాజేసిన ఘటన మరవక ముందే జిల్లాలోని మరో ఎస్బీఐ బ్రాంచ్లో ఇంకో స్కామ్ వెలుగులోకి వచ్చింది. సమభావన సంఘాలు, వ్యవసాయ రుణాలు, ముద్ర లోన్ల పేరిట అక్రమంగా రుణాలు తీసుకున్న ఓ మేనేజర్తన బంధువుల అకౌంట్లలోకి రూ.2.85 కోట్ల నగదును మళ్లించాడు. మూడు నెలల క్రితం బ్యాంక్ లో నిర్వహించగా ఈ గుట్టు బయటపడింది. రికవరీకి టైం ఇచ్చినా కట్టకపోవడంతో మంగళవారం పీఎస్లో ఫిర్యాదు చేశారు.
సమ భావనా సంఘాల పేరుతో లోన్లు
నూతనకల్ మండల తాళ్ల సింగారం బ్యాంక్మేనేజర్గా పని చేసిన హరిప్రసాద్ బ్యాంక్ సమీపంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ఔట్ సౌర్సింగ్ సిబ్బంది, ఎఫ్ఓఎస్ (ఫైనాన్షియల్అంబుడ్స్మెన్)తో కలిసి నకిలీ డ్యాక్యుమెంట్లు పెట్టి ఎస్హెచ్జీ(సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్), అగ్రికల్చర్, ముద్ర లోన్ల పేరిట లోన్లు తీసుకున్నాడు. ఇలా వచ్చిన రూ.2.85కోట్లను తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. వీటిలో ఎస్హెచ్జీ పేరిట రూ.1.30కోట్లు, అగ్రికల్చర్ లోన్లు రూ.65లక్షలు, ముద్ర లోన్లు రూ.90లక్షలు తీసుకున్నాడు.
ప్రతి నెలా ఈఎంఐ చెల్లిస్తుండగా ఎఫ్ఓఎస్ సహాయం చేసేవాడు. మూడు నెలల కింద ఆడిట్ నిర్వహించగా గుట్టు రట్టయ్యింది. ఎంక్వైరీ చేయగా నకిలీ డ్యాక్యుమెంట్లతో పాటు నకిలీ ఇన్ వాయిస్ లతో లేని యూనిట్ల పేరిట లోన్లు తీసుకున్నట్టు తేలింది. బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్తో పాటు మరో 13మందికి సంబంధమున్నట్టు గుర్తించారు. మూడు నెలల్లోపు రూ.2.85 కోట్లు చెల్లించాలని నోటీసులిచ్చారు. మేనేజర్, ఎఫ్ఓఎస్, ఔట్ సౌర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
14మందిపై కేసు నమోదు
అవకతవకలపై తాళ్లసింగారం ఎస్బీఐలో ప్రస్తుత మేనేజర్ రవీందర్ నూతన్ కల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు 14మందిపై కేసు నమోదు చేశారు. హరిప్రసాద్ హైదరాబాద్ లో ఉన్నారని, త్వరలో 14మందిని అదుపులోకి తీసుకుంటామని ఎస్సై సైదులు తెలిపారు.
