
ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన డీజీపీగా పనిచేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సస్పండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేశారని సమాచారం. ఏబీ ఇంటిలిజెన్స్ ఛీఫ్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై తన కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని సమాచారం. విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. నాణ్యత లేని నిఘా పరికరాల కొనుగోలు మరియు రాష్ఠ్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారనే ఆరోపణ కూడా ఉంది. అంతేకాకుండా.. కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని కూడా సమాచారం. విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని ప్రభుత్వం పేర్కొంది. ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను కూడా పట్టించుకోలేదని ప్రభుత్వం ఆరోపిస్తుంది. అసలు నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని పేర్కొంది. అవకతవకలకు పాల్పడ్డారు కాబట్టే ఉద్దేశ పూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఏబీ వెంకటేశ్వర రావు.. చంద్రబాబు హయాంలో పనిచేసిన ముఖ్య అధికారులలో ఒకరు కావడం గమనార్హం.
కాగా.. తన సస్పెన్షన్ ఆర్డర్పై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. తాను అక్రమాలు చేశానని సస్పెండ్ చేశారన్నది అవాస్తవమని ఆయన అన్నారు. సస్పెన్షన్పై చట్టప్రకారం ముందుకెళ్తానని ఆయన తెలిపారు. సస్పెన్షన్తో తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన అన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు.
For More News..