కడప జిల్లా ఖాజీపేట మండలం కొత్త నెల్లూరు సమీపంలోని బీరం శ్రీధర్రెడ్డి విద్యాసంస్థల్లో పులివెందులకు చెందిన ఆరోతరగతి విద్యార్థి సోహైల్(11) శనివారం తెల్లవారుజామున ( జులై 1) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోహైల్ ఈ తెల్లవారుజామున కడుపునొప్పిగా ఉందని హాస్టల్ సిబ్బందికి చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోహైల్ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒంటిపై గాయాలున్నాయని, ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే విద్యార్థి చనిపోయాడని ఆరోపిస్తూ అతని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద సోహైల్ మృతదేహంతో ఆందోళనకు చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకుల, స్థానికులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకోని ఆందోళన నిర్వహించాయి. దీంతో పోలీసులు భారీగా చేరుకుని బాధితులపై లాఠీచార్జి చేశారు. పాఠశాలకు కాపలాగా పోలీసులు మోహరించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు పాఠశాల యాజమాన్యానికి రక్షణ కలుగజేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులు స్కూలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారంటూ .. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలమని బాలుడి బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు.