
న్యూఢిల్లీ: ప్రీపెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్కు మారడానికి ఇక నుంచి మూడు నెలల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్ఎన్ఎల్ కూలింగ్ పీరియడ్ను 30 రోజులకు తగ్గించింది. ఈ మేరకు టెలికాం శాఖ (డాట్) ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఇక నుంచి కస్టమర్లు సులభంగా తమ మొబైల్ ప్లాన్లను మార్చుకోవచ్చు.
ముఖ్యంగా మొదటిసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్కు లేదా పోస్ట్పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు మారే వారికి ఇది వర్తిస్తుంది. ఇది వరకు కస్టమర్లు తమ ప్లాన్లను మార్చుకోవడానికి 3 నెలలు ఎదురుచూడాల్సి వచ్చేది. కొత్త నిబంధన ప్రకారం ఈ సమయాన్ని 30 రోజులకు తగ్గించారు. మొదటిసారి ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) ఆధారిత నో యువర్ కస్టమర్(కేవైసీ) వెరిఫికేషన్ ద్వారా ప్లాన్ను మార్చుకోవచ్చు.
తదనంతరం ఓటీపీ ఆధారిత మార్పిడులకు 90 రోజుల కూలింగ్- పీరియడ్ వర్తిస్తుంది. కస్టమర్లు 30 లేదా 90 రోజుల లాక్-ఇన్ పీరియడ్లో మళ్ళీ మార్చుకోవాలని కోరుకుంటే, వారు తమ నెట్వర్క్ ఆపరేటర్ ఔట్లెట్లకు వెళ్లి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రతిసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్కు లేదా దీనికి విరుద్ధంగా మారినప్పుడు లాక్-ఇన్ పీరియడ్ గురించి సబ్స్క్రయిబర్లకు స్పష్టంగా తెలియజేయాలని టెలికాం శాఖ నెట్వర్క్ ఆపరేటర్లను ఆదేశించింది.
కస్టమర్లు తమ ప్రస్తుత ఆపరేటర్ సర్వీస్తో సంతృప్తి చెందనప్పుడు త్వరగా ప్లాన్లను మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని డాట్వర్గాలు తెలిపాయి.