సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బిగ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన యూనిట్ ఒక మోషన్ పోస్టర్ పాటు, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం టీజర్ ను ముంబైలో రిలీజ్ చేశారు. భారీ యాక్షన్ విజువల్స్ లో రూపొందించిన ఈ టీజర్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. ‘చరిత్ర స్మరించుకుంటుంది..ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు’అంటూ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయే టీజర్ యుద్ద సన్నివేశాలతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీజర్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో వావ్ అనిపించేలా డిజైన్ చేశారు.
మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి.. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కావటంతో నిర్మాత రామ్ చరణ్ దగ్గరుండి సినిమా పనులన్ని చూసుకుంటున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.