పౌరసేవలను గ్రామీణ ప్రజానీకానికి మరింత చేరువలోకి తీసుకువచ్చేందుకు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘టీ వాలెట్’ను అందుబాటులోకి తీసుకురానున్నది. రంగారెడ్డి జిల్లా రూరల్ ఏరియాల్లో ఉన్న రేషన్ షాపుల్లో టీ వ్యాలెట్ను ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 919 రేషన్ షాపులు ఉండగా, వాటిలో అర్బన్ ఏరియాలో 218, రూరల్ ఏరియాల్లో 701 ఉన్నాయి. ప్రాధమికంగా రూరల్ ఏరియాల్లోని రేషన్షాప్ డీలర్ల వద్ద టీవాలెట్ను ప్రవేశపెట్టారు.
రేషన్ డీలర్లకే ప్రత్యేకం
గ్రామీణ ప్రాంతాల్లో బిల్లుల చెల్లింపులకు వీలుగా టీ వ్యాలెట్ ను రేషన్ డీలర్లకే పరిమితం చేశారు. రేషన్ షాపులు సరుకుల పంపిణీ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. మిగతా 15 రోజులు డీలర్లకు ఆన్లైన్ పేమెంట్ సర్వీసులను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. రేషన్ డీలర్లకు పూర్తి స్థాయిలో పనికల్పించాలనే ఉద్దశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం టీ-వాలెట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ టీ వ్యాలెట్ను జూన్ ఒకటో తేదీన ప్రారంభించారు. దీని సాంకేతికత అంశాలపై ఆర్డీవో ఆఫీసుల్లో శిక్షణ ఇచ్చారు. జూన్ 25 నుంచి రంగారెడ్డి రూరల్ రేషన్ షాపుల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నారు.
అన్ని రకాల చెల్లింపులు…
టీ వాలెట్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన నల్లబిల్లులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, మొబైల్ బిల్లులు, ఫోన్ రీఛార్జీలు, రైల్వే టిక్కెట్ బుకింగ్ వంటి సదుపాయాలను పొందవచ్చు. పట్టణ ప్రాంతాలకు వెళ్లి పన్నుల చెల్లింపులకు వీలులేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే టీ వ్యాలెట్ ద్వారా చెల్లించే అవకాశం అందుబాటులోకి వస్తుంది. దీంతో సమయం వృధా కాకపోవడమే కాకుండా నిర్ణీత సమయంలో చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వినియోగదారులు చెల్లించే బిల్లలను బట్టి డీలర్లకు కమిషన్ ఇస్తారు. ఒక్కొక్క ట్రాన్జాక్షన్కు కనీసం రూ.2.50ల నుంచి రూ.4ల వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేసుకునే వెసలుబాటును ప్రభుత్వం కల్పించింది.