న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు క్రికెట్ క్యాలెండర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పట్లో క్రికెట్ మొదలయ్యే ఆస్కారం కనిపించడం లేదు. ఆరు నెలల తర్వాత జరిగే టీ20 వరల్డ్కప్పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. గత గురువారం జరిగిన ఐసీసీ సీఈసీ మీటింగ్ కూడా ఈ టోర్నీపై ఎటూ తేల్చలేదు. ఈ పరిణామాల దృష్ట్యా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్–నవంబర్లో షెడ్యూల్ చేసిన ప్రపంచకప్ జరగడం దాదాపు అసాధ్యమని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై స్పందించిన బోర్డు అధికారి ఒకరు.. ఈ టోర్నీ జరగాలంటే చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముందుగా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని, ఇండియాతో పాటు అన్ని దేశాల్లో ప్రయాణాల రూల్స్పై క్లారిటీ రావాల్సి ఉందన్నారు. ‘నిజాయితీగా చెప్పాలంటే అక్టోబర్లో టీ20 జరగడం అసాధ్యమనిపిస్తోంది. అప్పటికి టోర్నీకి అవసరమైన వారిని ఒక్క చోటుకు చేర్చాలనే ఆలోచనే ఇప్పుడు అమాయకంగా అనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలు ఎంత వరకు భద్రమో ఎవ్వరికీ తెలియదు. కొందరు జూన్లో ప్రయాణాలు మొదలవుతాయని అంటే, ఇంకా సమయం పట్టొచ్చని మరికొందరు చెబుతున్నారు. ఒకసారి ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ మొదలైన తర్వాతే.. కరోనా వ్యాప్తి తగ్గిందో లేదో, ట్రావెల్పై దాని ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది’ అని అభిప్రాయపడ్డారు.
భద్రత ఎవరి బాధ్యత?
ఈ మెగా టోర్నీలో ఇన్వాల్వ్ అయ్యే ఆటగాళ్లు, అధికారుల భద్రత విషయంలో బాధ్యత ఎవరు తీసుకుంటారని బోర్డు అధికారి ప్రశ్నించారు. ఆ బాధ్యత ఐసీసీదా, క్రికెట్ ఆస్ట్రేలియాదా? అన్నారు.‘ఈ టోర్నీకి చాలా మంది వస్తారు. మరి, వారి సేఫ్టీకి సంబంధించిన బాధ్యతను తీసుకోవడానికి ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధంగా ఉన్నాయా? అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు ప్రభుత్వాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. మరి, ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఆ రిస్క్ తీసుకోవాలని అనుకుంటుందా? తీసుకుంటే తమ అంగీకారం ఎన్ని రోజుల్లో తెలుపాలి? టోర్నీ సన్నద్ధత విషయంలో ఇతర బోర్డులకు కూడా సమయం సరిపోతుందా? తమ జట్లను ఆసీస్కు పంపించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు అంగీకరిస్తాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి. మరో ప్రధాన అంశం ఫ్యాన్ సేఫ్టీ. ఇప్పుడున్న అనేక ఆంక్షల నడుమ ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారా? లేదంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం కోసం పది సీట్లలో ఒక్క టికెట్నే అందుబాటులో ఉంచుతారా?’ అని బోర్డు అధికారి ప్రశ్నలు సంధించారు. మరోవైపు గ్లేన్ మ్యాక్స్వెల్ లాంటి ఆసీస్ ఆటగాళ్లు.. ఖాళీ స్టేడియాల్లో టీ20 వరల్డ్కప్ నిర్వహణ అనేది కష్టమైన విషయమని ఇప్పటికే అభిప్రాయపడ్డారు. మెగా టోర్నీ రెండు, మూడు నెలలు పాటు వాయిదా పడ్డా అందుకు సిద్ధంగా ఉండాలని ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే టోర్నీ నిర్వహించాలని
అనుకుంటున్నట్టు వెల్లడించారు.
డొమెస్టిక్ సీజన్కు బ్యాకప్ ప్లాన్స్ లేవు: సబా కరీం
2020–21 డొమెస్టిక్ సీజన్కు సంబంధించి బ్యాకప్ ప్లాన్స్ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవలేదని బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సబా కరీం చెప్పారు. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు నిర్వహించాలన్నదే తమ ప్రయారిటీ అన్నారు. ‘ఈ సీజన్ విషయంలో మా దగ్గర ఎలాంటి బ్యాకప్ ప్లాన్స్ లేవు. మాకు ఆగస్టు వరకు టైమ్ ఉంది. నెల వారీగా ముందుకెళ్తాం. ఐపీఎల్, డొమెస్టిక్ పోటీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ పరిస్థితి నుంచి మనం ఎప్పుడు బయటపడతామే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది కాస్త భిన్నంగా కనిపిస్తోంది కాబట్టి మున్ముందు పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం. అందుకోసం అప్రమత్తంగా ఉండి, అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉంటాం’ అని కరీం చెప్పుకొచ్చారు.