సిడ్నీ: చిన్న జట్లు సంచలన విజయాలు సాధించాయి. వాటి దెబ్బకు రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ టోర్నీ హిస్టరీలో తొలిసారి క్వాలిఫయింగ్ దశలో వెనుదిరిగితే.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ నుంచి కోలుకొని మాజీ చాంపియన్ శ్రీలంక రేసులో నిలిచింది. దీనితో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే పెద్ద జట్లతో సవాల్కు రెడీ అయ్యాయి. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ తొలి రౌండ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ కిక్ డబుల్ అయ్యే సమయం ఆసన్నమైంది 16 జట్ల నుంచి పోటీ 12 జట్లకు చేరుకుంది. టోర్నీలో అసలు ఆట ఇప్పుడే మొదలవనుంది. పెద్ద జట్లు బరిలో నిలిచిన సూపర్ 12 రౌండ్ శనివారమే షురూ అవుతోంది. తొలి పోరులో గత ఎడిషన్ ఫైనలిస్టులు ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పెర్త్లో జరిగే రెండో పోరులో అఫ్గానిస్తాన్ను ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. ఇక, ఆదివారం ఇండియా–పాక్ మ్యాచ్తో టోర్నీ హీట్ మరింత పెరగనుంది. 12 జట్లు రెండు గ్రూపుల్లో పోటీ పడనుండగా.. వచ్చే నెల 13న జరిగే ఫైనల్ వరకు ఫ్యాన్స్కు సూపర్ ధమాకా కిక్ ఇవ్వనుంది.
కొత్త విజేతను చూస్తామా?
2007లో మొదలైన మెగా టోర్నీలో 2012, 2016లో విండీస్ తప్పితే ప్రతీసారి కొత్త విజేతే వచ్చింది. ఫేవరెట్ అనుకున్న జట్లు బోల్తా కొడితే.. అనామక జట్లు అద్భుతాలు చేస్తాయి. అందుకు వెస్టిండీస్నే ఉదాహరణగా చెప్పొచ్చు. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో ఇప్పటిదాకా ఏ జట్టూ కప్పు నెగ్గలేదు. కానీ, ఈ సారి ఆతిథ్య ఆస్ట్రేలియా కప్పు నెగ్గి కొత్త రికార్డు సృష్టించాలని చూస్తోంది. వరుసగా రెండోసారి చాంపియన్ అయ్యే బలం, బలగం ఆ జట్టు సొంతం. పైగా, చాలా దేశాలకు సవాల్ విసిరే హోమ్ కండిషన్స్ కంగారూలకు ప్లస్ పాయింట్ కానున్నాయి. 2019 వన్డే, 2021 టీ20 వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన కివీస్ తొలి కప్పు కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. కివీస్తో పాటు తొలి సారి కప్పు నెగ్గాలని ఆశిస్తున్న సౌతాఫ్రికా కూడా ఈసారి అన్ని విభాగాల్లో సమతూకంలో ఉన్న జట్టుతో బరిలో నిలిచింది. హార్డ్ హిట్టర్లతో నిండి కొన్నాళ్లుగా అటాకింగ్ గేమ్ ఆడుతున్న ఇంగ్లండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టుతో పాటు 2019 విన్నర్ పాకిస్తాన్ రెండోసారి చాంపియన్ అవ్వాలని ఆశిస్తోంది. తొలి రౌండ్ నుంచి వచ్చిన 2014 విన్నర్ శ్రీలంక ఆసియా కప్ విక్టరీని రిపీట్ చేయాలని చూస్తుండగా.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు క్వాలిఫయర్స్ పెద్ద జట్లకు గట్టి పోటీ ఇవ్వాలని కోరుకుంటున్నాయి.
ఇండియా ఏం చేస్తుందో
ఈ వరల్డ్ కప్పై టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. గతేడాది టోర్నీలో ఘోర ఓటమితో పాటు ఈ మధ్య ఆసియా కప్ (టీ20)లోనూ చుక్కెదురవడంతో జట్టుపై చాలా ఒత్తిడి ఉంది. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత మన జట్టు మెగా టోర్నీల్లో అంతగా హిట్టవడం లేదు. తొలిసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరల్డ్ కప్లో బరిలోకి దిగుతున్న జట్టు కప్పుతోనే తిరిగి రావాలని చూస్తోంది. గ్రూప్–2లో విండీస్ లేకపోవడం ఇండియాకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక, ఈ ఏడాది ఎనిమిది సిరీస్ల్లో ఏడు గెలిచి మరోటి డ్రా చేసుకొని జోరు మీదుంది. రోహిత్, రాహుల్, కోహ్లీతో పాటు సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బుమ్రా లేకపోవడంతో బౌలింగ్ వీక్ అయింది. అతని స్థానాన్ని షమీ ఏమేరకు భర్తీ చేస్తాడు? మరో సీనియర్ భువనేశ్వర్, యంగ్స్టర్స్ అర్ష్దీప్, హర్షల్ పటేల్ ఏ మేరకు రాణిస్తారన్నదానిపై టీమ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.