
హైదరాబాద్, వెలుగు: గర్భిణులు, బాలింతల ఆరోగ్య సమాచారాన్ని పొందుపర్చడంకోసం 38 దవాఖాన్లలో పన్జేస్తున్న గైనకాలజిస్టులకు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ అధికారులు శనివారం ట్యాబ్లు పంపిణీ చేశారు. దీంతో గర్భిణులు ఏ సర్కారు దవాఖానకు వెళ్లినా, వారి సమాచారం డాక్టర్లకు సులభంగా తెలియనుంది. దశలవారీగా టీవీవీపీ హాస్పిటళ్లలో పన్జేస్తున్న గైనకాలజిస్టులందరికీ ట్యాబ్లు అందిస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ట్యాబ్లు ఇచ్చిన 38 దవాఖాన్లలో సిజేరియన్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులతో ఉన్నతాధికారులు శనివారం సమావేశం నిర్వహించారు. సిజేరియన్లు ఎందుకు చేయాల్సి వస్తుందో, నార్మల్ డెలివరీ ఎందుకు చేయలేకపోతున్నారో విచారించారు. ఇకపై ప్రతి డెలివరీ రిపోర్టును ట్యాబుల్లో ఎంటర్ చేయాలని ఆదేశించారు. ఈ 38 హాస్పిటళ్లను టీవీవీపీ ఉన్నతాధికారులు నిరంతర పర్యవేక్షించాలని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా ఆదేశించారు.