- 979 మందికి పీహెచ్డీ పట్టాలు, 45 మంది స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్
- పీహెచ్డీ పట్టా అందుకోనున్న ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సీతక్క
ఓయూ,వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ 83వకాన్వొకేషన్కు ఠాగూర్ ఆడిటోరియం సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కాన్వొకేషన్కు గవర్నర్తమిళిసై హాజరు కానున్నారు. వివిధ విభాగాల్లో పీహెచ్డీలు పూర్తి చేసిన 979 మందికి పట్టాలు అందజేయనున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సీతక్క కూడా ఉన్నారు. టాపర్స్గా నిలిచిన 45 మంది స్టూడెంట్లు 57 గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు.
గోల్డ్ మెడల్స్ అందుకునే స్టూడెంట్లతో పాటు మరొకరికి మాత్రమే పాస్ జారీ చేసిన అధికారులు.. పీహెచ్డీ పట్టాలు అందుకునే వారి వెంట వచ్చే సహాయకులకు పర్మిషన్ ఇవ్వలేదు. 1,200 మంది సీటింగ్ కెపాసిటీ కలిగిన ఠాగూర్ ఆడిటోరియంలో స్టూడెంట్లకు వెయ్యి సీట్లు ఏర్పాటు చేశారు. మీడియాకు కేవలం 30 పాస్లు మాత్రమే జారీ చేసిన అధికారులు 24 సీట్లు మాత్రమే కేటాయించారు. పట్టాలు అందుకునే స్టూడెంట్లు, పాస్లున్న వారు ఆడిటోరియానికి మధ్యాహ్నం ఒంటిగంటన్నర లోపు చేరుకోవాలని అధికారులు సూచించారు.
కెమెరాలకు నో ఎంట్రీ
కాన్వొకేషన్ ప్రోగ్రామ్ను కవర్ చేసేందుకు వచ్చే మీడియా కెమెరాలు, ఫొటోగ్రాఫర్లకు ఆడిటోరియంలోకి అనుమతి ఇవ్వలేదు. తామే రికార్డు చేసి అందజేస్తామని, వర్సిటీ ప్రత్యేక లింక్ ద్వారా లైవ్లో ప్రోగ్రామ్ను టెలికాస్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ అందుకున్న వారిని ఆడిటోరియం బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు చేసుకోవచ్చని, లోపలికి మాత్రం కెమెరాలను, సెల్ఫోన్లను సైతం అనుమతించబోమని చెప్పారు.