ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రూల్స్కు విరుద్ధంగా కార్లపై ఎర్ర బుగ్గలు పెట్టుకుని తిరిగే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. 2017లో ఎర్రబుగ్గల వాడకంపై ప్రభుత్వం విధించిన రూల్స్కు వ్యతిరేకంగా చాలా మంది ఆఫీసర్లు, పొలిటీషియన్లు వాళ్ల కార్లపై ఎర్రబుగ్గ పెట్టుకుంటున్నారని మహబూబ్నగర్కు చెందిన న్యాయవాది భావనప్ప పిల్ దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలిల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. నిబంధనలకు విరుద్ధంగా బుగ్గ కార్లతో తిరిగేవాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. ఎర్ర బుగ్గల కార్ల వినియోగానికి సంబంధించి రూల్స్పక్కాగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ వివరాలతో సంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్పిల్పై విచారణ ముగించింది.
ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్కు బెయిల్
ఆన్లైన్ లోన్ యాప్స్కు ఆర్థిక సాయం అందించే క్యూడోస్ ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ పవిత్ర ప్రదీప్ వాల్వేకర్కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తక్కువ టైమ్కే భారీ వడ్డీలు వసూలు చేసే రోగ్ లోన్ యాప్స్ కేసు, మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ నమోదు చేసిన కేసులో వాల్వేకర్కు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇటీవల విచారణ జరగగా.. తాజాగా ఉత్వర్వులు జారీ అయ్యాయి. రూ.20 వేల రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. దేశం విడిచి పోకూడదని, ప్రతి శుక్రవారం ఉదయం10 గంటల నుంచి ఒంటి గంట మధ్య దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని, పాస్పోర్టు అప్పగించాలని ఆదేశించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోసం ఈడీ ప్రయత్నం చేయవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గుర్రంపోడు తండా కేసులో రఘునందన్ రావుకు ఊరట
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే రూ.25 వేల విలువ గల 2 వ్యక్తిగత పూచీకత్తులపై స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్భూయాన్ బుధవారం పోలీసులకు ఆదేశాలిచ్చారు. మఠంపల్లి పోలీసులు పెట్టిన కేసు దర్యాప్తుకు సహకరించాలని, అవసరమైనప్పుడు సంబంధిత దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని రఘునందన్ను హైకోర్టు ఆదేశించింది. గుర్రంపోడు తండాలో భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా బీజేపీ జరిపిన ఆందోళనకు సంబంధించి పోలీసులు బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్, రఘునందన్ రావు సహా పలువురిని నిందితులుగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే గతంలో బండి సంజయ్ ముందస్తు బెయిల్ పొందగా, ఇప్పుడు ఎమ్మెల్యే రఘునందన్కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.