
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత డబ్బులు వేస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
కడప మహానాడు అద్భుతంగా జరిగిందంటూ.. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారన్నారు. మహానాడు సభను విజయవంతం చేసిన వారికి అభినందనలు.. కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని ప్రకటించారు. మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు శాసనాల కాన్సెప్ట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు.