తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ ,అన్నాడీఎంకే నాయకుడు పీహెచ్ పాండియన్(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. పాండియన్ 2019 సెప్టెంబర్ నుంచి గుండె సమస్యతో వెల్లూరులోని క్రిస్టియన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పాండియన్ మృతి పట్ల అన్నాడీఎంకే నాయకులు సంతాపం ప్రకటించారు.
1972 లో అన్నాడీఎంకెలో చేరిన పిహెచ్ పాండియన్ 1985 నుండి 1987 వరకు ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్నారు. ఎంజీఆర్ మరణం తరువాత అన్నాడీఎంకే చీలిపోయినపుడు జయలలితతో చేతులు కలిపాడు. పాండియన్ 1996 నుండి 1999 మధ్య జయలలిత న్యాయ సలహాదారుగా పనిచేశాడు. పాండియన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తిరునెల్వేలి నియోజకవర్గం నుండి 1999 లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. జయలలిత మరణం తరువాత వి.కె.శశికలపై తిరుగుబాటు చేసిన పన్నీర్సెల్వం వర్గంలో పిహెచ్ పాండియన్ ఒకరు.