కరోనావైరస్ బారినపడి తమిళనాడు వ్యవసాయ మంత్రి దొరైక్కన్నూ(72) మృతిచెందారు. ఆయనకు అక్టోబర్ 13 కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దాంతో ఆయన చెన్సైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడిన దొరైక్కన్నూ ఊపిరితిత్తులు 90 శాతం పాడైపోయినట్లు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. ‘ఆయనకు వేరే జబ్బులుండటం వల్ల పరిస్థితి విషమించింది. ఆయనను ఎక్మో మరియు వెంటిలేటర్ మీద ఉంచి వైద్యం అందించాం. కానీ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 11:15కు ఆయన తుదిశ్వాస విడిచారు’ అని డాక్టర్ సెల్వరాజ్ తెలిపారు.
దొరైక్కన్నూ మృతికి తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ నివాళులు అర్పించారు. ‘తన సరళత, వినయం, సూటిగా మాట్లాడే తత్వం, పాలనా నైపుణ్యాలు ఆయనలోని గొప్ప లక్షణాలు. వ్యవసాయ శాఖ కోసం నిబద్ధతతో పనిచేసేవాడు. వ్యవసాయ మంత్రిత్వ శాఖను పూర్తి అంకితభావంతో నిర్వహించి తన బలమైన మార్కును ఏర్పరచుకున్నాడు. అతని అకాల మరణం తమిళ ప్రజలకు తీరని నష్టం. ముఖ్యంగా ఏఐఏడీఎంకె పార్టీకి పెద్ద లోటు’ అని గవర్నర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ఆస్పత్రిలో దొరైక్కన్నూను పరామర్శించారు. దొరైక్కన్నూ తంజావూరు జిల్లాలోని పాపనాసం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
For More News..