
నందమూరి తారకరత్న అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. ఫిలించాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. వైకుంఠ రథంలో చంద్రబాబు, బాలకృష్ణ, తారకరత్న కుటుంబసభ్యులు ఉన్నారు. తారక్, కల్యాణ్ రామ్, నారా లోకేశ్కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. తారకరత్న పాడెను బాలకృష్ణ, నందమూరి కుటుంబీకులు మోశారు. తండ్రి మోహన కృష్ణ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. తారకత్నకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రజలు, అభిమానులు, టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు. బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 23 రోజుల తర్వాత తారకరత్న మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.