న్యూ ఇయర్ వేళ ఫిలింనగర్‌లో డ్రగ్స్ కలకలం.. ఒకరి అరెస్ట్

న్యూ ఇయర్ వేళ ఫిలింనగర్‌లో డ్రగ్స్ కలకలం.. ఒకరి అరెస్ట్

న్యూ ఇయర్ వేళ జూబ్లీహిల్స్ పరిధిలోని ఫిలింనగర్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. సబ్ పార్కింగ్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ బాబు కిరణ్ గా గుర్తించారు. అతని వద్ద నుంచి 20 గ్రాముల ఎండిఎంఏను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

బాబు కిరణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పబ్ కు వచ్చే కొంత మందికి అతడు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం.

షాద్ నగర్‌లో NDPS డ్రగ్స్

ఇదిలావుంటే, నూతన సంవత్సర వేడుకల కోసం ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ తరలిస్తుండగా షాద్ నగర్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు షాద్ నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద స్థానిక పోలీసుల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు లక్ష రూపాయలు విలువైన NDPS అనే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా నుండి ఈ డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.