నిందితుడిని తప్పించాడంటూ టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ సస్పెన్షన్

నిందితుడిని తప్పించాడంటూ టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ సస్పెన్షన్
  •     ఇన్వెస్ట్​మెంట్​ ఫ్రాడర్​ సతీశ్​పారిపోయేందుకు  
  •        సహకరించాడనే ఆరోపణలు  
  •     సెంట్రల్ జోన్ ఎస్‌ఐ శ్రీకాంత్​పై వేటు  

హైదరాబాద్‌ సిటీ, వెలుగు:  సిటీ సెంట్రల్​జోన్​టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ గౌడ్​ను సీపీ సజ్జనార్‌ గురువారం సస్పెండ్​చేశారు. ఓ కేసులో నిందితుల నుంచి డబ్బులు తీసుకొని, వారు తప్పించుకునేలా చేసినట్టు ఆయనపై ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, రూ.3 వేల కోట్ల మోసాలకు పాల్పడిన ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని రూ.2 కోట్లు తీసుకుని తప్పించాడన్న అభియోగాలు శ్రీకాంత్ పై ఉన్నాయి. వ్యాపారంలో , పెట్టుబడి స్కీమ్స్​లో కల్పిస్తానని  చెప్పుకుని చాలామంది పెట్టుబడిదారులను మోసం చేశాడన్న ఆరోపణలు సతీశ్​పై ఉన్నాయి. నగరంలో ఉంటున్న కేంద్ర మాజీ  మంత్రి కొడుకును మోసగించి రూ.25 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులోనూ సతీశ్​ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

ఇలా ఇతడు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో సుమారు ₹3,000 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.  ఇతడిపై ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ లో ఇన్వెస్ట్​మెంట్​ఫ్రాడ్​తో పాటు పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అతడి గురించి వెతుకుతుండగా ముంబైలో ఉన్నట్టు గత వారం టాస్క్​ఫోర్స్​పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ నేతృత్వంలో ఒక బృందంఅక్కడికి వెళ్లింది. సతీశ్​తో పాటు ఆయన భార్య, బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిందితులను పోలీసుల వాహనంలో నగరానికి తీసుకురావాలి. 

కానీ, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్​మాత్రం తన టీమ్​తో కాకుండా నిందితుల కారు ఎక్కాడు. పైగా ఈ వెహికల్​ను నిందితుడి డ్రైవరే నడపడం గమనార్హం. వీరి వాహనం సదాశివపేట చేరడానికి 2 గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడున్న దాబా వద్ద సిద్ధంగా ఉంది.  ఆ కారులోకి మారిన నిందితులు కొల్లపూర్​వైపు పరారయ్యారు.

 అక్కడ, వాళ్లను వదిలేసిన ఎస్ఐ తాను హైదరాబాద్​ వెళ్తున్నట్టు తన సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో టాస్క్​ఫోర్స్​ఎస్ ఐ శ్రీకాంత్​ప్రమేయం ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ప్రాథమిక సమాచారం అందడంతో ఆయనను సస్పెండ్​ చేశారు. పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాంత్‌తో పాటు ఇతర అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని సూచించారు.