
న్యూఢిల్లీ: టాటా గ్రూప్కు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) టాటా క్యాపిటల్ వచ్చే నెల 6న తన రూ.17,200 కోట్ల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ని ప్రారంభించనుంది. అక్టోబర్ 8 న ఇది ముగుస్తుంది. భారత ఫైనాన్షియల్ రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలవనుంది. ఈ ఐపీఓలో 47.58 కోట్ల షేర్లు ఉంటాయి. ఇందులో 21 కోట్ల షేర్ల తాజా ఇష్యూ ఉంది. మిగిలిన 26.58 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా షేర్ హోల్డర్లు అమ్ముతారు. ఓఎఫ్ఎస్లో టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) 3.58 కోట్ల షేర్లు విక్రయిస్తాయి.
ప్రస్తుతం టాటా క్యాపిటల్లో టాటా సన్స్ వద్ద 88.6శాతం వాటా, ఐఎఫ్సీ వద్ద 1.8శాతం వాటా ఉంది. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను టైర్-1 క్యాపిటల్ బేస్ను మెరుగుపరిచేందుకు, భవిష్యత్ రుణ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ ప్రకటించింది. పెద్ద ఎన్బీఎఫ్సీలు మార్కెట్లో లిస్ట్ కావడాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టాటా క్యాపిటల్ ఐపీఓకి వస్తోంది. 2024–25లో ఈ ఎన్బీఎఫ్సీ కంపెనీకి రూ.3,655 కోట్ల నికర లాభం, రూ.28,313 కోట్ల రెవెన్యూ వచ్చింది.
2007 నుంచి 70 లక్షల మందికి పైగా కస్టమర్లకు సేవలందించిన ఈ సంస్థ, 25 కి పైగా రుణ ఉత్పత్తులతో వ్యక్తులు, ఎస్ఎంఈలు, కార్పొరేట్లకు సేవలందిస్తోంది. యాక్సిస్ క్యాపిటల్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, బీఎన్పీ పారిబా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, సిటీ గ్రూప్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, జేపీ మోర్గాన్ చేజ్ ఇండియా వంటి సంస్థలు ఈ పబ్లిక్ ఇష్యూని మేనేజ్ చేస్తున్నాయి. ఈ ఇష్యూ విజయవంతమైతే, 2023లో వచ్చిన టాటా టెక్నాలజీస్ తర్వాత టాటా గ్రూప్ రెండో పబ్లిక్ లిస్టింగ్గా నిలుస్తుంది.