టాటా మోటార్స్ కీలక ప్రకటన.. జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈవో రాజీనామా

టాటా మోటార్స్ కీలక ప్రకటన.. జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈవో రాజీనామా

టాటా మోటార్స్ కు చెందిన ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) థియెర్రీ బొలోరే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను సమర్పించారని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. సీఈవో హోదాలో సంస్థకు దాదాపు రెండేళ్లకు పైగా సేవలందించిన థియెర్రీ బొలోరే వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారని వెల్లడించింది. డిసెంబరు 31న ఆయన కంపెనీ నుంచి వైదొలుగుతారని తెలిపింది.

తాత్కాలిక సీఈవోగా అడ్రియన్ మార్డెల్ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. గత 32 ఏళ్లుగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీలోనే పనిచేస్తున్న అడ్రియన్ మార్డెల్.. ప్రస్తుతం సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులోనూ సభ్యులుగా ఉన్నారని వివరించింది. కాగా, గతంలో కార్ల కంపెనీ రెనాల్ట్ కు సీఈవోగా వ్యవహరించిన అనుభవం కలిగిన థియెర్రీ బొలోరేను.. అదే హోదా కోసం 2020 సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ తీసుకుంది.