
న్యూఢిల్లీ : టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండూ కలసి భారతదేశం అంతటా 500లకుపైగా హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేస్తాయి. టాటా పవర్ ఐఓసీఎల్ రిటైల్ అవుట్లెట్లలో ఈవీ చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేస్తుంది. టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీపీఈవీసీఎస్ఎల్), ఐఓసీఎల్ ఈ మేరకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేశాయి. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో అలాగే ముంబై-–పూణె ఎక్స్ప్రెస్వే, సేలం-–కొచ్చి హైవే, గుంటూరు–-చెన్నై హైవే వంటి ప్రధాన రహదారులపై వీటిని ఏర్పాటు చేస్తారు. విస్తారమైన ఇంటర్ సిటీ చార్జింగ్ నెట్వర్క్ను నిర్మించడంపై ఒప్పందం దృష్టి సారిస్తుంది.
ఇది నగరాల మధ్య ప్రయాణించే ఈవీ యజమానులకు చార్జింగ్ గురించిన ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుందని టాటా పవర్ బిజినెస్ డెవలప్మెంట్-ఈవీ చార్జింగ్ హెడ్ వీరేంద్ర గోయల్ అన్నారు. ఈవీ వినియోగదారులు 'టాటా పవర్ ఈజెడ్ చార్జ్' యాప్, ఇండియన్ ఆయిల్ఈ–చార్జ్ మొబైల్ యాప్ ద్వారా అన్ని వివరాలూ తెలుసుకోవచ్చని చెప్పారు. వారి సౌలభ్యం మేరకు చార్జర్లను బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఐఓసీఎల్ 2024 నాటికి 10వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందించాలని భావిస్తోందని వెల్లడించారు. టాటా పవర్ దాదాపు 60 శాతం మార్కెట్ వాటాతో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ డొమైన్లో లీడర్గా ఎదిగింది. 62వేల హోమ్ చార్జర్లు, 4,900 పబ్లిక్ సెమీ పబ్లిక్ చార్జింగ్ పాయింట్లు 430 బస్ చార్జింగ్ స్టేషన్లతో చార్జింగ్ సొల్యూషన్లను అందిస్తుంది.